రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కటాఫ్ తేదీగా 2024 జూలై 1ను నిర్ణయించారు. వయోపరిమితి మించిపోయిందనుకున్న అభ్యర్థులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఏప్రిల్ 7న రాసిన లేఖలో డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని కోరారు. దీంతో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి డీఎస్సీ నియామకానికి సంబంధించిన జీవో నెంబర్ 6ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. సబార్టినేట్ సర్వీస్ రూల్స్-1996లోని రూల్ 12 కింద వర్గాలకు సూచించిన గరిష్ట వయో పరిమితిని ప్రత్యేక అంశంగా తీసుకుని సడలించింది. అయితే పదోన్నతులు, పెన్షన్లు, డిపార్ట్మెంటల్ పరీక్షలు, ఫండమెంటల్ రూల్స్, సెలవు నియమాలు మొదలైన ఉద్యోగుల ఇతర నిబంధనలు, షరతుల్లో ఎటువంటి సడలింపు కోరకూడదనే షరతు విధించింది.
ఆ షరతుకు లోబడి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలకు (ఒకసారి మాత్రమే) సంబంధించి ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితిని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించినట్లు జీవో నెంబర్ 14లో పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాలను ప్రత్యేక కేసుగా తీసుకుని 1996 ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ -12(వి) సడలింపులో వయస్సును లెక్కించాడానికి కటాఫ్ తేదీగా 2024 జూలై 1ని నిర్ణయించినట్లు విద్యా శాఖ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే వారంలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీలో 16,347 పోస్టులకు గాను, ఎస్జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు వివిధ కారణాలతో నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనతో అభ్యర్థులు…. ప్రిపరేషన్లో తనమునకలై ఉన్నారు.
సంబంధిత కథనం