విదేశీ విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ విదేశీ యూనివర్సిటీల్లో షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల స్కాలర్షిప్ అందిస్తుంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది.
యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు చదువుకోవచ్చు. ఈ పథకం కోసం విద్యార్థుల నుంచి ముందుగా 31-08-25 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే తాజాగా 23-09-2025వ తేదీ నుంచి 19-11-2025 వరకు గడువును పొడిగించారు.
అర్హతగల విద్యార్థులు.. www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ పథకం వర్తించాలంటే విద్యార్థి కుటుంబ సంవత్సర ఆదాయం రూ.5లక్షలకు మించి ఉండకూడదు. పీజీ చదవడానికి డిగ్రీలో 60 శాత కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. TOEFL/IELTS/GRE/GMAT అర్హత సాధించాలి. అభ్యర్థి విద్యను అభ్యసించడానికి పాస్పోర్ట్, వీసా, విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ లెటర్ పొంది ఉండాలి.
కులం, ఆదాయం, నివాసం మీ సేవా నుంచి తీసుకోవాలి. అధికారిక వెబ్సైట్లో నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకం ద్వారా స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ఇతర వివరాలకు మీ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖను సంప్రదించవచ్చు. నవంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలి.