రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లోని 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలనే పరీక్షను నిర్వహించగా… తాజాగా అధికారులు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏపీ గురుకులాల్లోని ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. ఇక ఏపీఆర్ జేసీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ ను ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఐదో తరగతిలో 15,020 సీట్లకు 32,823 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక ఇంటర్లో ఉన్న 13,680 సీట్లకు గాను… 32,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఏపీ గురుకుల ఐదో తరగతి ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన సుమతి మొదటి ర్యాంక్ సాధించింది. ఇక అనకాపల్లికి చెందిన శరత్ రెండో ర్యాంక్, కర్నూల్ జిల్లాకు చెందిన బోయ విద్య మూడో ర్యాంక్ ను సొంతం చేసుకుంది.
ఇంటర్ ఎంట్రెన్స్ ఫలితాల్లో విశాఖ జిల్లాకు చెందిన గీతిక ఫస్ట్ ర్యాంక్ సాధించగా… కర్నూలు జిల్లాకు చెందిన శృతి, హాసినా… రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
ఇంటర్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు. మొత్తం 100 ప్రశ్నలకు ఎగ్జామ్ నిర్వహించగా… పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చారు. గణితంలో 25, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ , ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో దాన్నుంచి 15 ప్రశ్నలు అడిగారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావటంతో ఫలితాలను విడుదల చేశారు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను కేటాయిస్తారు.