ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 19వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని… మే 28వ తేదీతో ముగుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పరీక్షల ఫీజు చెల్లించుకోవాలని… మే 1వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపింది.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని సూచించింది. రూ. 50 ఆలస్యం రుసుంతో అయితే మే 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొంది. bseaps.in వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
ఇక ఏపీ టెన్త్ పరీక్షల రీవాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకునే వీలు ఉంది. మే 1 వరకు ఇందుకు అవకాశం ఉండగా… రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 1000 చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఈ ఫీజులను చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇక ఈసారి విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 81.14 శాతం నమోదైనట్లు తెలిపింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది.
సంబంధిత కథనం