ఏపీ పదో తరగతి ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలను విద్యాశాఖ వెల్లడించింది.
రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచే విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చని విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మే 1 వరకు ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 1000 చెల్లించాలని వివరించింది. సీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఈ ఫీజులను చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ విండో అందుబాటులోకి వస్తుంది. మే 1వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఫీజులు స్వీకరించరు. కేవలం ఆన్ లైన్ విధానంలోనే ఫీజులను స్వీకరిస్తారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకునే విద్యార్థులు… ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులను సంప్రదించాల్సి ఉంటుంది. స్కూళ్ల ద్వారానే దరఖాస్తులను స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది.
ఈసారి జరిగిన పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 81.14 శాతం నమోదైనట్లు తెలిపింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 పాఠశాలల్లో సున్నా శాతం నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.
సంబంధిత కథనం