ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ పై విద్యాశాఖ కసరత్తు - వారం రోజుల్లో నోటిఫికేషన్...!-ap mega dsc notification to be released soon here are key updates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ పై విద్యాశాఖ కసరత్తు - వారం రోజుల్లో నోటిఫికేషన్...!

ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ పై విద్యాశాఖ కసరత్తు - వారం రోజుల్లో నోటిఫికేషన్...!

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్ధమవుతోంది. ఖాళీలను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం…. వారం రోజుల లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గతంలో ప్రకటించిన విధంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుంది.

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2025 అప్డేట్స్

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత… వెంటనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించినప్పటికీ… పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రకటనలు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు కొనసాగుతోందని… కోర్టు కేసుల వంటి అంశాలతో జాప్యం ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది.

ఈ వారంలోపు ప్రకటనకు అవకాశం…!

వారం రోజులలోపు ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక విద్య టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను ఇందులో కాకుండా… వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో గతంలో ప్రకటించిన మాదిరిగానే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది.

కోర్టు కేసుల రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా అమలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో… రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన జీవో విడుదల చేసిన తర్వాతే… ఈ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ జీవో కూడా ఒకటి రెండు రోజుల్లో రావొచ్చని సమాచారం.

మరోవైపు ఈ వేసవి సెలవులలోపే టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా… పోస్టులను సర్దుబాటు చేస్తారు. ఫలితంగా టీచర్ల సేవలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే డీఎస్సీ పోస్టుల భర్తీలోపే పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలని… ఆపై కొత్త టీచర్లకు బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.

త్వరలోనే స్పెషల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ పోస్టుల భర్తీ..!

మరోవైపు ఏపీలో 2,260 స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మ‌రో 2,260 ఉపాధ్యాయ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. ఇందులో 1,136 ఎస్‌జీటీ ఖాళీలు ఉండగా… మరో 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులను ప్రస్తుతం ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ కాకుండా… ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది కోచింగ్ తీసుకున్నారు. త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని… ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.