ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సబ్జెక్టుల ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… తాజాగా విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. మెగా డీఎస్సీలో భాగంగా జూన్ 6 నుంచి జూన్ 28 వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గురువారం విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలను మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
తాజాగా విడుదలైన ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని సంబంధిత ఆధారాలతో జూలై 11 లోపు https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 29 నుండి జూలై 2 వరకు జరిగే పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామమని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి అయినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 91.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.
ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలోనే అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేస్తారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.