ఏపీ లాసెట్ - 2025 ప్రవేశ పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువు కూడా పెట్టారు.
ఈనెల 5వ తేదీన ఏపీ లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగింది. మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 27 వేలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. ఇందుకు జూన్ 8వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణీత నమూనాలో పంపాల్సి ఉంటుంది. లాసెట్ వెబ్ సైట్ లో కనిపించే కీ అబ్జెక్షన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఆపై మీ అభ్యంతరాలను పంపొచ్చు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 16వ తేదీన ఏపీ లాసెట్ ఫైనల్ కీని విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీన ర్యాంకులను వెల్లడిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. వీటికి తోడు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదలవుతుంది. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.