ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో కలిసి విద్యార్థులకు ఇంటర్న్షిప్లను అందిస్తు్న్నాయి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు మే 18 లోపు సంబంధిత వెబ్ సైట్ https://internship.aicte-india.org/ లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో సాధారణ ఇంటర్న్షిప్లతోపాటు ఉపకార వేతనాలు ఇచ్చేవి అందుబాటులో ఉన్నాయి.
మే 25 లోపు ఇంటర్న్ షిప్ లు
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్ విద్యార్థులు https://internship.aicte-india.org/ ఇంటర్న్ షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. మే 25లోపు విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు కేటాయిస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల స్టైఫండ్ ఇవ్వనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఏఐసీటీఈ వేసవి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సుమారు మూడు లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్టైపెండ్, ఉచిత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అందించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించారు.
ఏపీ ఉన్నత విద్యామండలి ఇంటర్న్షిప్ డాష్బోర్డ్ను శుక్రవారం ఛైర్మన్ ప్రొఫెసర్ కె.మధు మూర్తి, ఏఐసీటీఈ సీవోవో డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్, ఐఐటీ-ఎమ్ ప్రొఫెసర్ పార్థసారథి ప్రారంభించారు. ఏఐసీఈటీ ప్రతినిధులు రోహిత్ భరద్వాజ్, సూరజ్ కుమార్ ఇంటర్న్షిప్ పోర్టల్పై ఓరియంటేషన్ సెషన్లను నిర్వహించారు. విద్యార్థులకు అపార్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు.
స్టైఫండ్, ఉచిత సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్లు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఏపీ ఉన్నత విద్యామండలి, ఏఐసీఈటీ, ఐఐటీ మద్రాస్, ఇస్రో, డీఎస్టీ, బీబీటీ, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యంతో ఈ ఇంటర్న్ షిప్ లు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు అధికారిక ఇంటర్న్షిప్ పోర్టల్ను సందర్శించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ చేసి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం