ఏపీలో 15శాతం నాన్ లోకల్ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రస్తుతం అమలవుతున్న 15% నాన్ లోకల్, జనరల్ కోటా సీట్లను ఇకపై పూర్తిగా ఏపీ వారికే కేటాయిస్తారు.
2025-26 విద్యా సంవత్సరంలో నాన్ లోకల్ కోటా 15% సీట్లు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యార్థులకే దక్కుతాయి. నాన్ లోకల్ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి కూడా అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉత్తర్వులతో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల వారికి ఈ అవకాశం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యలో ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతర నిర్వచనాలను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో-20, 21, 22లను జారీ చేశారు.
తెలంగాణలో స్థానికతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానికులకే వర్తింప చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కన్వీనర్ కోటా సీట్లు 10%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు.
ఏపీలో స్థానికత రెండు రీజి యన్లుగా అమలు చేస్తారు. ఆంధ్ర యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వర వర్శిటీ రీజియన్లుగా స్థానికతను నిర్ణయి స్తారు. విభజన తర్వాత 10 ఏళ్లుగా ఏపీలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేసేవారు. తాజాగా ఉస్మానియా రీజియన్ ఏపీలో తొలగించారు. ఇకపై ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్ల వారీగా సీట్లను భర్తీ చేస్తారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఏయూ పరిధిలో ఉంటాయి. ఈ జిల్లాల్లో చదివే విద్యార్థులను ఏయూ రీజియన్ స్థానికులుగా పరిగణిస్తారు.
శ్రీ వేంకటేశ్వర పరిధిలో జిల్లాలు...
ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ పరిధిలో ఉంటాయి. ఈ జిల్లాల వారిని ఎస్వీ లోకల్గా పరిగణిస్తారు.
సంబంధిత కథనం