ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9 రకాల బడులు-ap education reforms 9 types of schools from next academic year primary list ready ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9 రకాల బడులు

ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9 రకాల బడులు

ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన 117 జీవో రద్దు చేసి మొత్తం 9 రకాల బడుల విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక జాబితాను రూపొందించారు.

ఏపీలో విద్యారంగ సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9 రకాల బడులు

కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా 9 రకాల పాఠశాలలు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రాథమిక జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న 6 రకాల బడులు స్థానంలో మరో మూడు జోడించి 9 రకాల బడుల విధానం అమలు చేయనున్నారు.

తరగతికో టీచర్

ఉన్నత పాఠశాలలో 4 రకాలు, ప్రాథమిక పాఠశాలల్లో 45 మంది లోపు ఉంటే బేసిక్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికొక టీచర్‌ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 1-10 తరగతులుంటే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 900 వరకు ఏర్పాటు చేయనున్నారు.

హైస్కూల్ ప్లస్

కొన్ని ప్రాథమికోన్నత స్కూల్స్, ఇంటర్మీడియట్‌తో కలిపి హైస్కూల్‌ ప్లస్‌లుగా కొనసాగిస్తారు. క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా 240కి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ముందుగా 5 రకాల బడులను తీసుకురావాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 9 రకాలు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి నూతన బడుల విధానం అమల్లోక రానుంది.

9 రకాల బడులు

  1. అంగన్‌వాడీలను మార్పు చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్- 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) బడులను శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్ గా ఏర్పాటు చేస్తారు. వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించనుంది.
  2. ప్రీ ప్రైమరీ-1, 2తో పాటు ఒకటి, రెండో తరగతులు కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా పిలుస్తారు.
  3. పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉండే పాఠశాలలను బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్ గా ఏర్పాటు చేస్తారు. 1-5 తరగతుల్లో 45 మందిలోపు పిల్లలుంటే వాటిని బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్ గా పరిగణిస్తారు.
  4. పీపీ-1, 2, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉండి, 45 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
  5. ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగనున్నాయి. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలలుగా, మరికొన్నింటిని ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
  6. 6 నుంచి 10 తరగతులు వరకు ఉన్నత పాఠశాలలు ఉంటాయి.
  7. 1-10 తరగతులు ఉంటే బేసిక్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పరిగణిస్తారు. జీఓ-117 రద్దుతో 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి వీటికి 1, 2 తరగతులను జోడించారు.
  8. 1-10 తరగతులు ఉంటే ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి, ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే తరగతికి ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.
  9. రాష్ట్రంలో మొత్తం 294 హైస్కూల్‌ ప్లస్‌లు కొనసాగిస్తారు. వీటిల్లో 1-12 లేదా 6-12 తరగతులు ఉంటాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం