రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపట్నుంచి (మే 19) మే 27 వరకు పరీక్షలు జరనగున్నాయి. ఈ పరీక్షలకు 3.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఏపీ ఈఏపీసెట్ -2025 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
ఈసారి ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక మే 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ తో కేంద్రాలకు 2 గంటల ముందే చేరుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోపకి అనుమతించరు. అభ్యర్థులు హాల్ టికెట్తోపాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలోని క్యాలిక్యులేటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదు.
ఇప్పటికే ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని https://cets.apsche.ap.gov.in/EAPCET/ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ 95523 00009 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షా కేంద్రం సులువుగా తెలుసుకునేలా హాల్ టికెట్ పై రూట్మ్యాప్ కూడా ఇచ్చారు.
ఇక పరీక్షల అనంతరం అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21వ తేదీన విడుదల చేస్తారు. ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ఆన్సర్ కీని మే 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఫైనల్ ఆన్సర్ కీని జూన్ 5వ తేదీన వెల్లడిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. రిజల్ట్స్ వెల్లడించిన కొన్ని రోజుల్లోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
సంబంధిత కథనం