డీఎస్సీ దరఖాస్తుల్లో టెట్ మార్కులు, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థులు చాలా ఏళ్లుగా డీఎస్సీ కోసం వేచిచూడడం, ప్రిపరేషన్ లో ఉండడంతో టెట్ మార్కులు మర్చిపోతున్నారు. దీంతో దరఖాస్తు సమయంలో వారికి ఇబ్బంది మారుతోంది. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం టెట్ ఐడీ, మార్కులను ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15తో దరఖాస్తులు ముగుస్తాయి. డీఎస్సీ దరఖాస్తుల్లో ముందు నుంచీ సమస్యలు తలెత్తున్నాయి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముందు స్టడీ, ఒరిజనల్ సర్టిఫికెట్ల అప్లోడింగ్ చేయాలని కోరడంతో ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మంత్రి నారా లోకేష్ సర్టిఫికెట్ల అప్లోడింగ్ కేవలం ఆప్షనల్ మాత్రమేనని చెప్పడంలో అభ్యర్థులు కాస్త రిలీఫ్ పొందారు. అయితే తాజాగా అభ్యర్థులకు మరో సమస్య తల నొప్పిగా మారింది.
అప్లికేషన్ లో పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు తప్పుగా నమోదు చేసిన వారు, వాటిని తిరిగి చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు ఎడిట్ కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా అభ్యర్థులు పేరు, అడ్రస్ వంటి వివరాలు తప్పులు నమోదు చేశారు. వాటిని ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. అయితే పుట్టిన తేదీ వివరాలు, ఆధార్ ఎడిట్కు మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆ వివరాలను సరిదిద్దుకునే వెసులుబాటు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థులు ర్యాలీలు చేశారు. నిరుద్యోగులు పోరాట ఫలితంగా ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు అన్నారు. పరీక్షకు కనీసం 90 రోజులను సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
వయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయిన వారికి వయస్సు పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 47 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచిందన్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా 47 సంవత్సరాలకు వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.