తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే/జూన్ 2025లో నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును మే 01, 2025 వరకు పొడిగించింది.
జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పరీక్ష ఫీజు మొత్తాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం, చెల్లింపు గేట్వేను ఉపయోగించి చెల్లించవచ్చని పేర్కొంది. మే 2, 2025లోపు TGBIE ఖాతాకు ఆన్లైన్లో బదిలీ చేయడానికి మాత్రమే అనుమతించబడ్డారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.
జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఒకేసారి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 9న ఇంటర్ ఫస్టియర్ , జూన్ 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి.
జూన్ 11న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. జూన్ 12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీగా పేర్కొన్నారు.
సంబంధిత కథనం