Sainik School Admissions: దేశంలో సాయుధ బలగాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచి సిద్ధం చేసేందుకు ఏర్పాటైన సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 2025- 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టిఏ ఆధ్వర్యంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ సైనిక పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాలకు నోటిఫికేషన్ను ఎన్టిఏ విడుదల చేసింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ను ఎన్టిఏ విడుదల చేసింది.
సైనిక పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ క్యాడెట్లుగా ప్రాధాన్యత లభిస్తుంది. ఇండియన్ నేవీ , ఇతరసాయుధ బలగాల అకాడమీల్లో క్యాడెట్లుగా చేరేందుకు ప్రాధాన్యత ఉంటుంది.
ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దరఖాస్తులను ఆన్లైన్లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2025 జనవరి 13గా నిర్ణయించారు. పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 31నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. తొమ్మిదో తరగతి ప్రవేశాలకు వయస్సు 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, అనంత పురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్ర వరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ https://exams.nta.ac.in/AISSEE లో చూడొచ్చు. విద్యార్హతలు, రిజర్వేషన్లు, పరీక్ష సిలబస్ తదితర వివరాలు ఎన్టిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.