తెలంగాణ టెట్‌కు 1.83 లక్షల దరఖాస్తులు.. చివరి రోజు భారీగా పెరిగిన దరఖాస్తుల సంఖ్య-183 lakh applications for telangana tet number of applications increased on the last day ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెట్‌కు 1.83 లక్షల దరఖాస్తులు.. చివరి రోజు భారీగా పెరిగిన దరఖాస్తుల సంఖ్య

తెలంగాణ టెట్‌కు 1.83 లక్షల దరఖాస్తులు.. చివరి రోజు భారీగా పెరిగిన దరఖాస్తుల సంఖ్య

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ టెట్ 2025కు చివరి రోజు అనూహ్యంగా దరఖాస్తులు పోటెత్తాయి. లక్షన్నరకు మించి దరఖాస్తులు రావని భావించినా అనూహ్యంగా 1.83లక్షల మంది టెట్‌కు దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్ 30వ తేదీతో తెలంగాణ టెట్ దరఖాస్తు గడువు ముగిసింది. గడువు ముగిసే రోజు చివరి రెండు గంటల్లో 18వేల మంది దరఖాస్తులు సమర్పించారు.

తెలంగాణ టెట్‌కు పెరిగిన దరఖాస్తులు

తెలంగాణ టెట్‌ 2025కు చివరి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు టెట్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా చివరి రోజు చివరి గంటల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తం 1.83 లక్షల మంది దరఖాస్తు చేశారు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. ఈ ఏడాది దరఖాస్తులు 1.50 లక్షలు దాటకపోవచ్చని విద్యాశాఖ అంచనా వేసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు టెట్ నిర్వహించడంతో కొత్తగా బిఇడి, డిఇడి పూర్తి చేసిన వారు లేకపోవడంతో దరఖాస్తులు తగ్గుతాయని భావించారు.

దరఖాస్తు గడువును కూడా పొడిగించక పోవడంతో లక్షన్నర లోపు దరఖాస్తులు వస్తాయని భావించారు. అనూహ్యంగా చివరి రోజు ఏకంగా 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

చివరి గంటల్లో పెరిగిన టెట్ దరఖాస్తులు

30వ తేదీ చివరి రెండు గంటల్లో 18,492 మంది టెట్‌కు దరఖాస్తు చేశారు. పేపర్‌ 1కు 63,261 మంది దరఖాస్తు చేయగా, పేపర్‌ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేశారు. రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15వేల మంది ఉన్నారు.

గత జనవరిలో నిర్వహించిన టెట్‌కు 2,75,775మంది దరఖాస్తు చేసుకోగా ఈ సారి 1.83లక్షల దరఖాస్తులకు పరిమితం అయ్యాయి. దాదాపు 92వేల దరఖాస్తులు తగ్గాయి. ఎస్‌జిటిలుగా పనిచేస్తున్న వారు కూడా స్కూల్‌ అసిస్టెంట్ పోస్టుల కోసం టెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కాగా.. ఎలాంటి గడువు పొడిగించలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ అప్డేట్ ఇచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చింది. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని పేర్కొంది.

టీజీ టెట్ అప్లికేషన్ 2025 - ఇలా ఎడిట్ చేసుకోండి…

తెలంగాణ టెట్ 2025కు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.

హోం పేజీలో ‘Edit Application’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.

ఇక్కడ జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.

మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.

ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.

తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది.

జూన్ 15 నుంచి టెట్ పరీక్షలు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 9వ తేదీ నుంచి టెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ప్రాథమిక కీలను ప్రకటించిన తర్వాత.... జూలై 22వ తేదీన టెట్‌ ఫలితాలను వెల్లడిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం