ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ సమయంలో మార్కుల గురించి భయాందోళన చెందడం చాలా సహజం. చాలా మంది విద్యార్థులు ఈ సమయంలో ఇలానే భావిస్తారు. అయితే.. విద్యార్థులు ఒంటరి కాదని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆందోళనను అధిగమించడానికి 10 మార్గాలను సూచించారు.
1.మార్కుల గురించి భయపడుతున్నారని లేదా ఆందోళన చెందుతున్నారని గుర్తించాలి. మీ భావాలను అణచివేయడానికి ప్రయత్నించవద్దు. వాటిని స్వీకరించడం వాటిని ఎదుర్కోవడానికి మొదటి అడుగు.
2.మీపై మీరు ఎక్కువగా ఒత్తిడి చేయకోవద్దు. మీ శాయశక్తులా ప్రయత్నించారని గుర్తుంచుకోవాలి. ఫలితం ఎలా ఉన్నా, మీ ప్రయత్నాన్ని మీరు గుర్తించాలి.
3.ఫలితాల గురించి నిరంతరం ఆలోచించడం మానుకోవాలి. మీకు ఇష్టమైన పనులు చేయాలి. ,స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. విశ్రాంతి తీసుకోండి.
4.ఫలితాలు ఎలా ఉన్నా బాగా నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
5.మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఉపాధ్యాయులతో మీ భయాలు, ఆందోళనల గురించి మాట్లాడండి. మీ భావాలను పంచుకోవడం ద్వారా మీరు తేలికగా ఉండవచ్చు. వారు మీకు మద్దతు ఇవ్వగలరు.
6.ఒకవేళ మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే.. ఏమి చేయాలో ఆలోచించండి. ప్రత్యామ్నాయ కోర్సులు లేదా కళాశాలల గురించి తెలుసుకోండి. ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంటే.. ఆందోళన కొంతవరకు తగ్గుతుంది.
7.ప్రతి పరిస్థితిలోనూ సానుకూల అంశాలను చూడటానికి ప్రయత్నించండి. ఫలితాలు మీకు అనుకూలంగా రాకపోతే.. అది ఒక ముగింపు కాదని, కొత్త ప్రారంభానికి అవకాశం అని గుర్తుంచుకోండి.
8.మీ పరీక్ష ఫలితాలు మీ తెలివితేటలు లేదా మీ విలువను నిర్ణయించవని గుర్తుంచుకోండి. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మీకు అనేక ఇతర సామర్థ్యాలు, లక్షణాలు ఉన్నాయని తెలుసుకోండి.
9.మీ ఆందోళన చాలా ఎక్కువగా ఉంటే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడానికి వెనుకాడకండి. వారు మీకు సహాయం చేస్తారు.
10.జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఈ పరీక్ష ఒక చిన్న అడ్డంకి మాత్రమే. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. విజయం మీ సొంతమవుతుంది.
సంబంధిత కథనం