రూ. 2వేల నోట్లను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పుడు రూ. 500 ఓట్లు కూడా రద్దు అవుతాయని గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం తాజాగా చెక్ పెట్టింది! 2026 మార్చ్ నుంచి రూ. 500 నోట్లు చెలామణిలో ఉండవని వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
2026 మార్చ్ నాటికి రూ. 500 నోట్లు రద్దు అవుతాయని క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి వీడియో బయటకు వచ్చింది. 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఫలితంగా ప్రజల్లో అయోమయం, భయాందోళనలు నెలకొన్నాయి.
ఇక ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది.
"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, వాదనలను ఎల్లప్పుడూ వెరిఫై చేసుకోవాలని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ కూడా సూచిస్తోంది. రూ.500 నోట్లను రద్దు చేయలేదు, చట్టబద్ధంగానే ఉన్నాయి,. వార్తలను నమ్మడానికి లేదా భాగస్వామ్యం చేయడానికి ముందు అధికారిక వనరుల నుంచి ఎల్లప్పుడూ ధృవీకరించండి," అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.
2016 నవంబర్లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 ఎంఎం x 150 ఎంఎం, స్టోన్ గ్రే కలర్లో వస్తుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని నోట్ల మాదిరిగానే రూ.500 నోట్లు కూడా 17 భాషల్లో ఉన్నాయి. ఈ భాషల్లో ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి.
2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ టెలివిజన్ ప్రసంగంలో రూ.1000 నోట్లతో పాటు రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో అవినీతిపై పోరుకు, నకిలీ నోట్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ కొత్త రూ.2,000 నోటును ప్రవేశపెట్టింది. అయితే ఆ నోట్లను 2023 మేలో చెలామణి నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా ఉపసంహరించుకున్నప్పటికీ రూ.2000 నోట్లు చట్టబద్ధంగానే ఉన్నాయి.
సంబంధిత కథనం