What is SpaceFiber?: ఢిల్లీలో శుక్రవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress (IMC) ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఐఎంసీ లో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పేస్ ఫైబర్ (SpaceFiber) వివరాలను ప్రధాని మోదీకి వివరించారు.
ఈ ఐఎంసీ (IMC) లో రిలయన్స్ జియో (Reliance Jio) తమ లేటెస్ట్ ఎడిషన్ రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్ (JioSpaceFiber) ను ప్రారంభించింది. ఇది ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలు అందని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించే అవకాశం ఉంటుంది. భారత్ లో ఇదే తొలి ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. ‘డిజిటల్ సొసైటీలో ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసే లక్ష్యంతో ఈ స్పేస్ ఫైబర్ ను ప్రారంభించామని ఆకాశ్ అంబానీ తెలిపారు. ప్రభుత్వ సేవలకు, విద్య, వైద్యం, వినోదం.. తదితర రంగాలకు ఈ స్పేస్ ఫైబర్ సేవలను అందిస్తుందన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ పరిథిలోకి రాని లక్షలాది మంది ఈ నెట్ వర్క్ లోకి వస్తారన్నారు.