అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికన్ పరిశ్రమలను బలోపేతం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనీసం 10 శాతం పన్ను విధిస్తూ టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. సుంకాల్లో తేడాలను "భయంకరమైన అసమతుల్యతలు"గా అభివర్ణించారు. అమెరికా పారిశ్రామిక రంగం బలహీనపడి, జాతీయ భద్రతకు ప్రమాదం కలిగిస్తోందని ట్రంప్ వాదించారు.
ఏప్రిల్ 2న, డోనాల్డ్ ట్రంప్ "విముక్తి దినోత్సవం"గా ప్రకటించారు. ఈ టారిఫ్ల ద్వారా ప్రపంచంలోని 180 దేశాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా భారతదేశంపై 26 శాతం పన్ను విధించారు. ఇది అమెరికా దిగుమతులపై భారతదేశం విధించే పన్నులో సగం. ఈ చర్య రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా, ఆటోమొబైల్ దిగుమతులపై 25 శాతం పన్ను టాటా మోటార్స్ వంటి భారతీయ ఆటో కంపెనీలపై ప్రభావం చూపుతుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారతదేశ ఎగుమతులు 77.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అదే సమయంలో, అమెరికా నుండి భారతదేశ దిగుమతులు 17 శాతం తగ్గి 42.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ "అసమతుల్యతను" సరిచేయడానికే ట్రంప్ ఈ టారిఫ్లను విధించారు.
భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రధాన వస్తువులు ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా ఉత్పత్తులు, యంత్రాలు మరియు పెట్రోలియం ఉత్పత్తులు. ఈ టారిఫ్ల ప్రభావం ఈ రంగాలపై తీవ్రంగా ఉంటుంది.
అమెరికా డిమాండ్ల జాబితా కోసం భారతదేశం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. రష్యా, యూఏఈల నుండి చౌకగా లభిస్తున్నందున, సైనిక మరియు చమురు కొనుగోళ్లలో భారతదేశం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది.
అమెరికా కేవలం వాణిజ్య లోటునే కాకుండా, భారతదేశంలోని వివిధ రంగాలలో అమెరికన్ కంపెనీలకు ఉన్న మార్కెట్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై విధించే పన్నులో సగం మాత్రమే విధించినందున, ఇది ప్రతీకారం కంటే చర్చలకు అవకాశం కల్పిస్తుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం