Passenger vehicle sales : ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో జోరుకు అసలు కారణాలు ఇవే!
India Passenger vehicle sales : ఇండియాలో ప్యాసింజర్ సెగ్మెంట్ కళకళలాడుతోంది. ఇటీవలి కాలంలో పీవీలో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు పలు కారణాలను వివరించింది ఫాడా.
India Passenger vehicle sales : ఇండియాలో ఆటోమొబైల్ మార్కెట్ గత కొన్ని నెలలుగా కళకళలాడుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా ఎదిగింది ఇండియా. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికిల్ (పీవీ) సెగ్మెంట్లో డిమాండ్ విపరీతంగా కనిపిస్తోంది. ఫాడా (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) డేటా ప్రకారం.. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే.. 2023 ఫిబ్రవరిలో పీవీ సెగ్మెంట్లో విక్రయాలు 11శాతం మేర పెరిగాయి. 2020 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 16శాతం ఎక్కువగా సేల్స్ జరగడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
భారీ డిమాండ్కు కారణాలు ఇవే..
పీవీ సెగ్మెంట్లో డిమాండ్ నానాటికి పెరుగుతుండటానికి పలు కారణాలను వివరించింది ఫాడా. వీటిల్లో ప్రధానమైనది దేశంలోని పెళ్లిళ్ల సీజన్. పెళ్లి సమయంలో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఫలితంగా సేల్స్ సంఖ్య పెరుగుతోందని ఫాడా పేర్కొంది. మరికొన్ని నెలల పాటు ఈ జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు వివరించింది. మరోవైపు.. సంస్థలు కొత్త కొత్త మోడల్స్ను లాంచ్ చేస్తూ ఉండటం, వాటిపై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుండటం కూడా ఓ కారణం అని స్పష్టం చేసింది.
Demand for Passenger vehicles in India : కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు ఆటోమొబైల్ మార్కెట్లో సప్లై చెయిన్ వ్యవస్థ సమస్యలు ఉండేవి. ఇప్పుడు క్రమక్రమంగా సమస్యలు తగ్గి, పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఫలితంగా ఆటోమొబైల్ సంస్థలు వాహనాల తయారీని వేగవంతం చేస్తున్నాయి. గతంలో అనేక విడిభాగాలు దొరికేవి కావు. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పటికీ, అప్పటితో పోల్చుకుంటే పరిస్థితులు చాలా వరకు మెరుగుపడినట్టే! ఈ పరిణామాలతో వివిధ సంస్థల మోడల్స్కు బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.
అక్కడ ఆందోళనకరమే..!
India Automobile sector : దేశీయంగా పీవీ సెగ్మెంట్కు మంచి డిమాండ్ కనిపిస్తున్నప్పటికీ.. గ్రామీణ భారతంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని ఫాడా చెబుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా.. గ్రామీణ మార్కెట్లో కొనుగోళ్లు ఆశించినంత మేర ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఇండియాకు గ్రామీణ మార్కెట్ ఎంతో కీలకమని, ఇక్కడ పరిస్థితులు మెరుగుపడితేనే ఆటోమొబైల్ భవిష్యత్తు బాగుంటుందని అంటోంది.