త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వాటిలో H-1B, L-1, EB-5 వంటి ఇమిగ్రెంట్ వీసాలున్నాయి. ముఖ్యంగా, H-1B, L-1, EB-5 వీసాలు USకు వలస వెళ్లేందుకు భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేవి.
2016 తర్వాత H-1B, L-1, EB-5 వీసా ఫీజులను పెంచడం (US Visa fee Hike) ఇదే మొదటిసారి. H-1B, L-1, EB-5 వీసాల కోసం పెంచిన కొత్త ఫీజులు 2024, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని యుఎస్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఉపయోగించే ఫారమ్లు, ఫీ స్ట్రక్చర్లలో మార్పుల వల్ల నికర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వీసా ఫీజుల పెంపు అనివార్యమైందని యూఎస్ హోం శాఖ తెలిపింది.
H-1B వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇది అమెరికాలోని కంపెనీలు సాంకేతిక నైపుణ్యం లేదా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం మరియు చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఉద్యోగులను అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ వీసా ఆధారంగా నియమించుకుంటాయి.
EB-5 ప్రొగ్రామ్ ను 1990లో US ప్రభుత్వం ప్రారంభించింది. అమెరికన్లకు ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడేలా అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లతో వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమైన వారికి, వారి కుటుంబ సభ్యులకు అమెరికా ఈ EB-5 వీసా అందజేస్తుంది.
L-1 వీసా కూడా USలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలోకి వస్తుంది. ఇది ఇంట్రా కంపెనీ బదిలీ దారుల కోసం ఉద్దేశించిన వీసా. బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుండి నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగులను USలో తాత్కాలికంగా పని చేయడానికి బదిలీ చేసుకోవడానికి ఈ వీసా అనుమతిస్తుంది.