Tirupati temple assets : విప్రో, నెస్లే, ఎం అండ్ ఎం కన్నా.. శ్రీవారి ఆస్తులే ఎక్కువ!
Tirupati temple assets : శ్రీవారి ఆస్తుల వివరాలను ఇటీవలే ప్రకటించింది టీటీడీ. అయితే.. విప్రో, నెస్లే వంటి దిగ్గజ సంస్థల కన్నా శ్రీవారి అస్తుల విలువే ఎక్కువ అని మీకు తెలుసా?
Tirupati temple assets : తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ రూ.2.5లక్షల కోట్లు(30బిలియన్ డాలర్లు) అని టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఇటీవలే ప్రకటించింది. ఇది.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ- ఐఓసీ సంస్థల మార్కెట్ క్యాపిటల్ కన్నా ఎక్కువ అని మీకు తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
'గోవిందా.. గోవిందా..'
తిరుమలను ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఎన్నో విలువైన కానుకలను శ్రీవారికి సమర్పించుకుంటారు. కాగా.. 1933 నుంచి తొలిసారిగా తిరుమల శ్రీవారి ఆస్తులను ప్రకటించింది టీటీడీ. ఆస్తుల్లో 10.25 టన్నుల బంగారం, 2.5టన్నుల ఆభరణాలు, రూ. 16వేల కోట్ల నగదు ఉన్నాయి. ఇవన్నీ బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా.. టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ మొత్తం విలువ రూ. 2.5లక్షల కోట్లు.
TTD net worth : దీనిని స్టాక్ మార్కెట్లోని సంస్థలతో పోల్చి చూస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడుతుంది. ఎన్నో ‘బ్లూ చిప్’ కంపెనీల నెట్ వర్త్ కన్నా శ్రీవారి ఆస్తులే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. బెంగళూరు ఆధారిత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మార్కెట్ క్యాపిటల్ రూ. 2.14లక్షల కోట్లుగా ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్స్ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 1.99లక్షల కోట్లు.
ఇక అంతర్జాతీయ ఫుడ్ అండ్ డ్రింక్ సంస్థ నెస్లేకి చెందిన ఇండియా విభాగం మార్కెట్ క్యాపిటల్ రూ. 1.96లక్షల కోట్లుగా ఉంది.
Assets of Tirumala Temple : వీటితో పాటు.. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మమీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, వేదాంత, డీఎల్ఎఫ్తో పాటు.. ఎన్నో సంస్థల మార్కెట్ క్యాపిటల్.. శ్రీవారి ఆస్తుల కన్నా తక్కువే!
ఒక్క బీఎస్ఈలోనే 6వేలకు పైగా కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. వీటిల్లో సుమారు 30 సంస్థల మార్కెట్ క్యాపిటల్ మాత్రమే.. శ్రీవారి అస్తుల కన్నా ఎక్కువగా ఉన్నాయి. రిలయన్స్(రూ. 17.53లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 11.76లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 8.34లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 6.37లక్షల కోట్లు), ఐసీఐసీ బ్యాంక్(రూ. 6.31లక్షల కోట్లు) వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీల్లోని పలు ఆలయాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుంటాయి.
సంబంధిత కథనం