Mahindra cars price hike: హరియప్.. మహింద్ర కార్ల ధరలు పెరగబోతున్నాయి.. ఎప్పటి నుంచి అంటే..?
Mahindra cars price hike: భారతదేశంలో తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని మహీంద్రా (Mahindra) సంస్థ యోచిస్తోంది. థార్ నుంచి ఎక్స్ యూ వీ 700 వరకు అన్ని ఎస్ యూవీలకు ఈ పెంపు వర్తిస్తుంది.
2024 జనవరి 1వ తేదీ నుంచి దాదాపు అన్ని మహింద్ర కార్ల ధరలు పెరగనున్నాయి. భారతదేశంలో విక్రయించే అన్ని SUV ల ధరలను పెంచాలని మహింద్ర (Mahindra) సంస్థ భావిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి వస్తువుల ధరల్లో పెంపు తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోనుంది. అయితే, అన్ని మోడల్స్ కార్ల ధరలను పెంచాలని భావిస్తోందా? లేక కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ ధరలనే పెంచాలనుకుంటోందా? అన్న విషయాన్ని మహింద్ర సంస్థ ప్రకటించలేదు.

మిగతా కంపెనీలు కూడా..
కార్ల ధరలను పెంచాలని ఇప్పటికే అనేక ఇతర వాహన తయారీ సంస్థలు ప్రకటించాయి. ఈ దిశగా మారుతి సుజుకి (maruti suzuki) ఇప్పటికే తన నిర్ణయం ప్రకటించింది. ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారత్ లో కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. తమ లైనప్ లోని కార్ల ధరలను జనవరి 2024 నుంచి పెంచుతామని టాటా మోటార్స్ (Tata Motors) కూడా ప్రకటించింది. ఆడి (audi) వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థ కూడా 2024 నుంచి కార్ల ధరలను పెంచనుంది.
ప్రతీ సంవత్సరం
భారతదేశంలోని వాహన తయారీదారులు సాధారణంగా తమ కార్ల ధరలను ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సార్లు పెంచుతుంటారు. కొన్నిసార్లు కొన్ని మోడల్స్ కార్ల ధరలను మాత్రమే పెంచితే, మరికొన్ని సార్లు మొత్తం తమ లైనప్ లోని అన్ని కార్ల ధరలను పెంచుతూ ఉంటారు. ఆయా సంవత్సరాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు, ముడి సరుకుల ధరలు, సేల్స్.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా సంస్థలు ఈ పెంపును నిర్ణయిస్తాయి.