Tesla in India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్​..-tesla looking to make half million evs annually in india priced from 20 lakh report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్​..

Tesla in India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్​..

Sharath Chitturi HT Telugu

Tesla in India : ఇండియాలో అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లా.. అందుకు తగ్గట్టు సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు టెస్లా ప్రణాళికలకు సంబంధించిన ఓ నివేదిక బయటకొచ్చింది.

ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్​.. (REUTERS)

Tesla in India : ఇండియాలోకి టెస్లా రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ప్లాన్స్​కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. దేశంలో ప్రతి యేటా కనీసం 5లక్షల ఎలక్ట్రిక్​ వాహనాలను తయారు చేయాలని ఎలాన్​ మస్క్​ సంస్థ ప్రణాళికలు రచించిందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. అంతేకాకుండా.. ఇక్కడ తయారు చేసిన వాహనాలను ఇండో పెసిఫిక్​ ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు కూడా సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు తెలిపింది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఇండియాలో టెస్లా ఓ పెద్ద ఫ్యాక్టరీని సిద్ధం చేస్తుంది. ఇండియాను ఎక్స్​పోర్ట్​ హబ్​గా తయారు చేస్తుంది.

వాహనాల ధరలు ఇలా..!

ఇండియాలోకి టెస్లా రాక కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రయత్నాలు జరిగినా.. పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు.. ఎలామ్​ మస్క్​కు చెందిన సంస్థ, ఇండియాలోకి అడుగుపెట్టడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాల ధరలు ఎంత ఉండొచ్చు? అన్న సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగానే టెస్లా మోడల్స్​ అంటే.. లగ్జరీ వాహనాలు అని గుర్తింపు ఉంది. ఇక ఇండియాలోనూ ఇదే విధంగా సంస్థ మోడల్స్​ ఉండొచ్చు. సంబంధిత నివేదిక ప్రకారం.. ఇండియాలో టెస్లా కార్ల ప్రారంభ ఎక్స్​షోరూం ధర 24,400.66 డాలర్లుగా ఉండొచ్చు. అంటే.. ఇండియన్​ కరెన్సీలో ఇది సుమారు రూ. 20.02 లక్షలు! ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అతి చౌకైన ఎలక్ట్రిక్​ వాహనం ఎంజీ కామెట్​ ఈవీతో పోల్చుకుంటే దీని ధర రెండింతల కన్నా ఎక్కువ! బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఈవీతో పోల్చుకుంటే.. రూ. 5లక్షల కన్నా ఎక్కువ.

కుదిరిన రాజీ..!

Tesla cars in India : వాస్తవానికి భారత్​లో ఉండే ట్యాక్స్​ కారణంగానే టెస్లా ఇంతకాలం వెనకడుగు వేసింది. ఈ విషయాన్ని ఎలాన్​ మస్క్​ కూడా చాలాసార్లు ప్రస్తావించారు. అయితే.. వాహనాలను ఇండియాలో తయారు చేస్తే పన్నులు తగ్గిస్తామని భారత ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. తొలుత ఈ ప్రతిపాదనని టెస్లా తోసిపుచ్చింది. ముందు ఈవీలను పంపిస్తామని, ఆ తర్వాత డిమాండ్​ బట్టి తయారీ విషయాన్ని చూస్తామని పేర్కొంది. ఫలితంగా ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు.

కొంతకాలం తర్వాత టెస్లా మనసు మార్చుకుంది! ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలను తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అదే సమయంలో గత నెలలో అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎలాన్​ మస్క్​తో చర్చలు జరిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇక ప్రస్తుతం టెస్లా- ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనం