భారత్, పాక్ యుద్ధంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలి?-stock market in losses due to india pakistan war how should investors react now ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారత్, పాక్ యుద్ధంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలి?

భారత్, పాక్ యుద్ధంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలి?

Sudarshan V HT Telugu

భారత్, పాక్ యుద్ధం తీవ్రమవుతోంది. భారత జనావాసాలు కేంద్రంగా పాక్ చేస్తున్న డ్రోన్, క్షిపణి దాడులను భారత్ విజయవంతంగా తిప్పికొడ్తోంది. మరోవైపు, పాకిస్తాన్ పై భారత్ ముప్పేట దాడిని తీవ్రం చేసింది. భారత్, పాక్ యుద్ధంతో భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైంది.

స్టాక్ మార్కెట్ స్ట్రాటెజీ (freepik)

యుద్ధ భయాల మధ్య స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 507.64 పాయింట్లు తగ్గి 79,827.17కి చేరుకోగా, నిఫ్టీ 50 సూచీ 160 పాయింట్లు తగ్గి 24,113.80కి చేరుకుంది. దాదాపు అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండో పాక్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, సెల్లింగ్ కు వెళ్తుండడంతో మార్కెట్ రెడ్ లో కొనసాగుతోంది.

భయాందోళనల్లో ఇన్వెస్టర్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు, భారత్, పాక్ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది పెట్టుబడిదారులకు అయోమయంగా మారింది.

భయపడవద్దు..

అయితే, ఈ పరిస్థితిపై పెట్టుబడిదారులు భయపడవద్దని, స్వల్ప కాలిక నష్టాలను తట్టుకుంటే, దీర్ఘకాలంలో లాభాలకు ఢోకా ఉండదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలోని కంపెనీల లాభాలు రాబోయే త్రైమాసికాలు. సంవత్సరాల్లో బాగానే ఉంటాయని, అందువల్ల నిర్బయంగా పెట్టుబడులు పెట్టవచ్చని సూచిస్తున్నారు. అయితే, మార్కెట్ పరిస్థితులను, యుద్ధ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తు ఉండాలని, తదనుగుణంగా, వ్యూహాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు.

పానిక్ సెల్లింగ్ వద్దు

యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అయితే, పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, అనవసరంగా మంచి స్టాక్స్ ను నష్టాలతో అమ్ముకోవద్దని సూచించారు. తొందరపడి పానిక్ సెల్లింగ్ చేయవద్దని, అయితే, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "పెట్టుబడిదారులు భయపడవద్దు. స్టాక్స్ మొత్తం అమ్మేసి మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రయత్నించకూడదు. జాగ్రత్తగా, అధ్యయనం చేసి పెట్టుబడి పెట్టండి. పరిణామాలను పర్యవేక్షించండి. పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి ఉండండి" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ అన్నారు.

ఊహించినంత పడిపోలేదు..

యుద్ధ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ సాధారణంగా భారీగా పతనం అవుతుంది. అయితే, భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం ఊహించనంతగా పడిపోలేదు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, నిలదొక్కుకుంది. స్వల్ప ప్రతికూలతలతో కొనసాగుతోంది. ఇది ఆశాజనక పరిణామం అని నిపుణులు వివరించారు. "సాధారణ పరిస్థితులలో, ఇలాంటి రోజున, మార్కెట్ తీవ్ర కోతలను ఎదుర్కొనేది. కానీ రెండు కారణాల వల్ల అలా జరగలేదు. అవి ఒకటి, భారతదేశం ఇప్పటివరకు బలమైన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించడమైతే, మరొకటి భారతదేశం బలమైన ఆర్థిక స్థితి అని విజయ్ కుమార్ వివరించారు.

సూచన: ఈ వ్యాసంలోని అభిప్రాయాలు, సిఫార్సులు నిపుణులు/బ్రోకరేజీల వ్యక్తిగత అభిప్రాయాలు. ఇవి హెచ్ టీ తెలుగు అభిప్రాయాలను ప్రతిబింబించవు. ఏదైనా పెట్టుబడి లేదా ట్రేడింగ్ ను ఎంచుకునే ముందు అర్హత కలిగిన బ్రోకర్ లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం