Stock Market: లాభాలతో స్టాక్ మార్కెట్ సూచీలు షురూ
Stock Market: స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. నేడు అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉన్నాయి.
Stock Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మార్చి 21, మంగళవారం) లాభాలతో షురూ అయ్యాయి. కిందటి సెషన్లో నష్టాలను చూసిన మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 270.64 పాయింట్ల లాభంతో 57,899.59 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 76.90 పాయింట్లు బలపడి 17,065.30 వద్ద కొనసాగుతోంది. సోమవారం సెషన్లో అమెరికా మార్కెట్లు లాభపడడం.. భారత సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును తక్కువగానే పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఏర్పడ్డాయి.
ట్రెండింగ్ వార్తలు
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
సెషన్ ప్రారంభంలో ఐజీఎల్, మహానగర్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, సీజీ కన్య్జూమర్, ఇండియా బుల్స్ హౌసింగ్ స్టాక్స్ లాభాలతో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గెయిల్, నాల్కో, ఎం&ఎం ఫైనాన్షియల్, సన్ టీవీ నెట్వర్క్, ఐఈఎక్స్ స్టాక్స్ టాప్ లూజర్లుగా ఆరంభంలో ట్రేడ్ అవుతున్నాయి.
మళ్లీ లాభాల్లోకి..
US Markets: సంక్షోభంలో కూరుకుపోయిన బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో అమెరికా మార్కెట్లు మళ్లీ కాస్త సానుకూలంగా మారాయి. సోమవారం సెషన్లో డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ 382.60 పాయింట్లు పెరిగి 32,244.58 వద్ద స్థిరపడగా.. ఎస్&పీ 500 ఇండెక్స్ 34.93 పాయింట్లు బలపడి 3,951.57 వద్ద ముగిసింది. నాస్డాక్ కంపోజైట్ 45.03 పాయింట్లు బలపడి 11,675.54 వద్దకు చేరింది.
ఆసియా మార్కెట్లు
అమెరికా మార్కెట్లలో సానుకూలతతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాలతో ఓపెన్ అయ్యాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పీతో పాటు ఆస్ట్రేలియా మార్కెట్లు గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్లకు నేడు సెలవు.
రెండేళ్ల కనిష్టానికి క్రూడ్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పడిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1.5 శాతానికిపైగా క్రూడ్ ఆయిల్ రేటు క్షీణించింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 73.15 డాలర్ల వద్ద ఉంది. 15 నెలల్లో ఇదే అత్వల్ప ధరగా ఉంది. బ్యాంకింగ్ రంగం సంక్షోభంతో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నాయి. దీంతో చమురుకు డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనతో ధరలు పడుతున్నాయి.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.55 వద్ద ఉంది.