RBI Policy Impact : ఆర్బీఐ చేసిన ఈ ప్రకటన తర్వాత గోల్డ్ లోన్ కంపెనీల షేర్లు భారీగా పతనం-stock market huge fall in stocks of companies providing gold loans after this rbi announcement ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Policy Impact : ఆర్బీఐ చేసిన ఈ ప్రకటన తర్వాత గోల్డ్ లోన్ కంపెనీల షేర్లు భారీగా పతనం

RBI Policy Impact : ఆర్బీఐ చేసిన ఈ ప్రకటన తర్వాత గోల్డ్ లోన్ కంపెనీల షేర్లు భారీగా పతనం

Anand Sai HT Telugu

RBI Policy Impact : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటనతో గోల్డ్ లోన్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి.

గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ఆర్బీఐ ప్రభావం

గోల్డ్ లోన్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి. గోల్డ్ లోన్లకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ త్వరలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన తర్వాత ఈ క్షీణత నమోదైంది.

నిబంధనలు జారీ చేస్తాం

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు బంగారు రుణాలు ఇస్తాయని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిని వినియోగం, ఆదాయ కల్పన అవసరాలకు ఉపయోగిస్తారు. వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై సమగ్ర నిబంధనలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.

గోల్డ్ లోన్ కంపెనీలపై ఎఫెక్ట్

ఈ ప్రకటన గోల్డ్ లోన్లపై ఆధారపడిన కంపెనీల షేర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి.

ఉదయం 11.15 గంటల సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ షేరు ధర 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.560 దిగువన ట్రేడవుతోంది. మణప్పురం ఫైనాన్స్ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ.222.33 వద్ద ముగిసింది. ఈ స్టాక్ ప్రస్తుతం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) బ్యాన్‌ల జాబితాలో ఉంది.

కొత్త నిబంధనల ప్రభావం ఎందుకు?

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు గోల్డ్ లోన్ కంపెనీల రుణ ప్రక్రియను కఠినతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వారి సంపాదనపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం ప్రధానంగా బంగారు రుణాలపై ఆధారపడిన కంపెనీలపై ఎక్కువగా ఉంటుంది. ముత్తూట్ వంటి కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని భావిస్తున్నారు.

కొత్త నిబంధనల తర్వాత గోల్డ్ లోన్ మార్కెట్ కుంచించుకుపోవచ్చని లేదా ఈ కంపెనీల వ్యయం పెరగవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ భయంతోనే ఈ స్టాక్స్ అమ్ముడుపోయాయి. అయితే కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి గోల్డ్ లోన్ రంగంలో పారదర్శకత, రిస్క్ మేనేజ్మెంట్ను పెంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం