Stock market crash : ట్రంప్ చేసిన ఆ ఒక్క పనితో స్టాక్ మార్కెట్లు క్రాష్! రికార్డు కనిష్ఠానికి రూపాయి..
Stock market crash : సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. దీనికి కారణాలేంటి? ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లపై 'ట్రంప్' పిడుగు పడింది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై టారీఫ్లు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ట్రేడింగ్ సెషన్లో క్రాష్ అయ్యాయి. రూపాయి సైతం ఆల్-టైమ్ లోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్ క్రాష్..
శనివారం ట్రేడింగ్ సెషన్లో 77,506 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో 77,064 వద్ద ఓపెన్ అయ్యింది. అనంతరం 76,756 వద్ద ఇంట్రాడే- లో ని హిట్ చేసి ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 500 పాయింట్ల నష్టంతో 77,007 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక నిఫ్టీ50.. శనివారం 23,482 వద్ద క్లోజ్ అయ్యి, సోమవారం 23,319 వద్ద ఓపెన్ అయ్యింది. 23,222 వద్ద ఇంట్రాడే- లో ని నమోదు చేసి, ఉదయం 11 గంటల సమయంలో 181 పాయింట్ల నష్టంతో 23,301 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు పతనమవుతోంది?
1. ట్రంప్ పేల్చిన టారీఫ్ బాంబు..!
బలహీన అంతర్జాతీయ సంకేతాలపై భారత స్టాక్ మార్కెట్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే విస్తృత వాణిజ్య యుద్ధం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా ప్రధాన ఆసియా మార్కెట్లు సోమవారం పతనమయ్యాయి. జపాన్కు చెందిన నిక్కీ, కొరియాకు చెందిన కోస్పీ 3 శాతం చొప్పున నష్టపోయాయి.
"మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం సుంకాలు విధించడం.. ఇమ్మిగ్రేషన్, అక్రమ వ్యాపారం వంటి సమస్యలకు శిక్ష అని అర్థం చేసుకోవడం ముఖ్యం. ట్రంప్ మళ్లీ ఇతర దేశాలపైనా సుంకాలను ప్రయోగించే అవకాశం ఉంది. 10 శాతం సుంకాల విషయంలో చైనా ప్రతిస్పందన మరింత బాధ్యతాయుతంగా ఉంది. మెక్సికో, కెనడా మాదిరిగా ప్రస్తుతానికి వారు సుంకాల పెంపు విధానం అనుసరించలేదు. బదులుగా, వారు అమెరికా చర్యకు వ్యతిరేకంగా డబ్ల్యూటీఓను ఆశ్రయిస్తున్నారు," అని విజయకుమార్ అన్నారు.
2. రికార్డు కనిష్టానికి చేరిన రూపాయి..
అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం రికార్డు స్థాయి కనిష్ఠం (రూ. 87) వద్ద ప్రారంభమైంది. కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించడంతో డాలర్ బలపడింది.
డాలర్ ఇండెక్స్ 109.6కు పెరగడం ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) మరింత అమ్మకాలను ప్రేరేపిస్తుందని, ఇది మార్కెట్ని ఒత్తిడికి గురి చేస్తుందని విజయకుమార్ అన్నారు.
3. ఆర్బీఐ ఎంపీసీ
కేంద్ర బడ్జెట్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై పడింది. ఆర్బీఐ ఈసారి.. 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని అంచనాలు ఉన్నాయి.
4. ఎఫ్ఐఐల అమ్మకం..
అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిరంతర అమ్మకాలు దేశీయ స్టాక్ మార్కెట్ తిరోగమనానికి ప్రధాన కారణం!
అక్టోబర్ 2024 నుంచి ఎఫ్ఐఐలు స్థిరంగా భారతీయ ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్ని భారీగా ప్రభావితం చేస్తోంది.
అక్టోబర్ 1, 2024 నుంచి ఫిబ్రవరి 1, 2025 మధ్య, ఎఫ్ఐఐలు దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల విలువైన భారతీయ స్టాక్స్ని డంప్ చేశారు.
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం