Sensex, Nifty rallies: స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ
Sensex, Nifty rallies: దాదాపు నెల రోజుల వరుస పతనాల తరువాత భారతీయ స్టాక్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది.
మార్చి 3, శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) సుమారు 900 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ (Nifty) 272 పాయింట్లు లాభపడింది.
Sensex, Nifty rallies: పైపైకి సెన్సెక్స్, నిఫ్టీ
అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ రాజకీయాలు, విదేశీ నిధుల ఆగమనం తదితర సానుకూల వార్తల ప్రభావంతో మార్కెట్లు శుక్రవారం లాభాల బాటన నడిచాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ (BSE Sensex) శుక్రవారం 899.62 లాభపడి 59,808.97 పాయింట్లకు చేరింది. ఉదయం నుంచే సెన్సెక్స్ లో పాజిటివ్ ట్రెండ్స్ కొనసాగాయి. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో సెన్సెక్స్ 1,057.69 పాయింట్ల వరకు లాభపడింది. ఆ తరువాత క్రమంగా తగ్గింది. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ (NSE Nifty) 272.45 పాయింట్లు లాభపడి 17,594.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) శుక్రవారం రూ. 12,770.81 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Sensex, Nifty rallies: ఈ షేర్లలో మంచి మూవ్ మెంట్
ఎస్బీఐ (State Bank of India), ఎయిర్ టెల్ (Bharti Airtel), రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), ఐటీసీ (ITC), టాటా స్టీల్ (Tata Steel), ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), హెచ్డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank), టాటా మోటార్స్ (Tata Motors), టైటన్ (Titan).. తదితర కంపెనీల షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. టెక్ మహింద్ర (Tech Mahindra), అల్ట్రా టెక్ సిమెంట్ (UltraTech Cement), నెస్ట్లే,(Nestle), ఆసియన్ పెయింట్స్ (Asian Paints) కొంతమేరకు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరోప్, అమెరికా మార్కెట్లలోనూ సానుకూల ట్రేడింగ్ కొనసాగింది.
Sensex, Nifty rallies: మైనారిటీ వాటాను అమ్మేసిన ఆదానీ
ఆదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోని నాలుగు సంస్థల్లో ఉన్న మైనారిటీ వాటాను అమెరికాకు చెందిన GQG Partners కు రూ. 15,446 కోట్లకు అమ్మేసిన వార్త కూడా మార్కెట్లలో ర్యాలీకి కారణమైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.07% తగ్గి 84.69 డాలర్లకు చేరింది.