SBI Hikes MCLR Rates: ఎస్బీఐలో లోన్ తీసుకున్నారా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే
SBI Hikes MCLR Rates: ఎస్బీఐలో రుణం తీసుకున్న వారు ఇప్పటి నుంచి కాస్త ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం రావొచ్చు. ఎందుకంటే ఎంసీఎల్ఆర్ రేట్లను ఆ బ్యాంకు పెంచింది. పూర్తి వివరాలివే.
SBI Hikes MCLR Rates: భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India - SBI).. రుణగ్రహీతలకు చేదువార్త చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) బేసిస్ పాయింట్ల (bps)ను ఈ దిగ్గజ బ్యాంక్ మరోసారి సవరించింది. వివిధ కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. అంటే రుణ రేటు 0.15 శాతం వరకు అధికమైంది. సవరించిన ఈ వడ్డీ రేట్లు నేటి (నవంబర్ 15) నుంచే అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలను ఉంచింది. ఈ రేటు సవరణతో రుణం తీసుకున్న వారి లోన్ మొత్తం పెరగనుంది. పూర్తి వివరాలివే.
SBI Hikes MCLR Rates: వివిధ కాలవ్యవధులు (Tenures) ఉండే రుణాలపై వడ్డీ రేటును ఇప్పుడు ఎస్బీఐ పెంచింది. ఏడాది కాలవ్యవధి ఉండే రుణాలపై MCLR రేట్ను 10 బేసిస్ పాయింట్లు పెంచగా.. 8.05 శాతానికి వడ్డీ రేటు చేరింది. ఇంతకు ముందు ఇది 7.95 శాతంగా ఉండేది. హౌసింగ్, కార్, పర్సనల్ లోన్స్ తీసుకునే వారు ఎక్కువ శాతం ఏడాది టెన్యూర్ నే ఎంపిక చేసుకుంటారు.
రెండేళ్ల, మూడేళ్ల కాల వ్యవధి రుణాలపై MCLRను 10 బేసిస్ పాయింట్లు పెంచింది ఎస్బీఐ. దీంతో వాటి రేట్లు వరుసగా 8.25శాతం, 8.35శాతానికి పెరిగాయి.
ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి MCLRలను 15 బేసిస్ పాయింట్లను స్టేట్బ్యాంక్ అధికం చేసింది. దీంతో వాటిపై వడ్డీ వరుసగా 7.75శాతం, 7.60శాతానికి చేరాయి. ఆరు నెలల కాలపరిమితి ఉండే రుణాలపై MCLR 15 బేసిస్ పాయింట్లు పెరిగి వడ్డీ 8.05శాతానికి చేరింది.
రుణాలపై బ్యాంకులు విధించే కనిష్ఠ వడ్డీ రేటునే MCLR అంటారు. దీని కంటే తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. విభిన్న కాలవ్యవధి రుణాలకు MCLR వేర్వేరుగా ఉంటుంది.
SBI Hikes MCLR Rates: ప్రభావం ఎలా పడుతుంది?
MCLR బేసిస్ పాయింట్లు పెరిగితే అది నేరుగా చెల్లించాల్సిన రుణాలపై ప్రభావం చూపుతుంది. లోన్ వడ్డీ రేటు అధికమవుతుంది. దీంతో MCLR ఆధారం తీసుకున్న లోన్ మొత్తం అధికమవుతుంది. రుణం తీసుకున్న వారు మరింత ఎక్కువ ఈఎంఐను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం ఈఎంఐను బ్యాంకులు సవరిస్తాయి. అంటే MCLRతో లింక్ అయి ఉన్న రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లు ఇప్పటి నుంచి కాస్త ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.