రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్న వేళ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి ఏడు రోజులు నిర్దేశిత ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందని వెల్లడించింది. ఈ పథకం 2025 మే 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొంది.
సకాలంలో వైద్యం అందించడంలో జాప్యం కారణంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా.. ది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025” (రోడ్డు ప్రమాద బాధితుల నగదు రహిత చికిత్స పథకం)ని అమలు చేసింది ప్రభుత్వం. మోటారు వాహనాన్ని ఉపయోగించడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత చికిత్సకు అర్హులని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.
"పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థలు మొదలైన వాటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్) అమలు చేస్తుంది. “ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల పాటు లక్షా యాభై వేల రూపాయల వరకు ఏదైనా నిర్దేశిత ఆసుపత్రిలో నగదు రహిత చికిత్సకు బాధితుడు అర్హులు,” అని నోటిఫికేషన్లో ఉంది.
నిర్దేశిత ఆసుపత్రి కాకుండా ఇతర ఆసుపత్రుల్లో ఈ పథకం.. కింద చికిత్స స్థిరీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉండాలని, అవి కూడా మార్గదర్శకాల ప్రకారం ఉండాలని నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది.
నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. నేషనల్ హెల్త్ అథారిటీతో సమన్వయంతో పాటు నిర్దేశిత ఆసుపత్రుల ఆన్బోర్డింగ్, బాధితుల చికిత్స, సంబంధిత విషయాలపై నిర్దేశిత ఆసుపత్రికి చెల్లింపు కోసం పోర్టల్ని మెయిన్టైన్ చేయడం, ఉపయోగానికి బాధ్యత వహిస్తుంది.
ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం రోడ్డు కార్యదర్శి ఆధ్వర్యంలో 11 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ, ఎంఓఆర్టీహెచ్ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఫలితంగా 1.72 లక్షల మరణాలు సంభవించాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు.
సంబంధిత కథనం