RBI Interest Rate Hike: వడ్డీరేటును పెంచిన ఆర్బీఐ.. ఈఎంఐలు మరింత భారం
RBI Interest Rate Hike: ఆర్బీఐ.. రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వినియోగదారుల ఈఎంఐ మొత్తం అధికమయ్యే అవకాశం ఉంది.
RBI Interest Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేటును మరోసారి అధికం చేసింది. 35 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో వడ్డీ రేటు 6.25 శాతానికి చేరింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం నిర్ణయాలను ఆ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం (డిసెంబర్ 7) ప్రకటించారు. రెపోరేటును (Repo Rate)ను 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు వెల్లడించారు. ద్రవ్యోల్బణం కాస్త కట్టడి అవుతున్న సంకేతాలు ఉండటంతో వడ్డీ రేట్లను ఆర్బీఐ మోస్తరుగానే పెంచింది. గత మూడుసార్లు 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ.. ఈసారి 35కు పరిమితం చేసింది. ఆర్బీఐ రెపోరేటును పెంచడం ఇది వరుసగా ఐదోసారి. ఈ ఏడాది మేలో 4.4 శాతంగా ఉన్న వడ్డీ రేటు తాజా పెంపుతో 6.25 శాతానికి చేరింది. దీంతో, బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారి ఈఎంఐల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
2022-23 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాను 6.8శాతానికి RBI తగ్గించింది. 2023-24 తొలి క్వార్టర్లో 7.1 శాతం, రెండో త్రైమాసికంలో 5.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి అంచనాలను సవరించినా.. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తుల్లో భారత్ ఉంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని అన్నారు.
బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారిపై ప్రభావం ఎలా..
RBI Repo Rate Hike: సాధారణంగా ఎస్బీఐ, కెనరా, ఐసీఐసీఐతో పాటు మిగిలిన వాణిజ్య బ్యాంకులన్నీ ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకుంటాయి. వాటిని బ్యాంకులు.. వినియోగదారులకు లోన్లుగా ఇస్తాయి. ఇప్పుడు బ్యాంకులకు ఇచ్చిన రుణాలపై ఆర్బీఐ రెపోరేటు/వడ్డీ రేటును పెంచింది. ఈ భారాన్ని వాణిజ్య బ్యాంకులు రుణ గ్రహీతలపై వేస్తాయి. దీనివల్ల ఇప్పటికే బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారి ఈఎంఐల మొత్తం పెరుగుతుంది. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఎందుకంటే ఆర్బీఐ రెపోరేటును బ్యాంకులు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కుగా నిర్దేశించుకుంటాయి.