రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ ను ఇకపై ఈ పేరుతోనే పిలుస్తారు; ధ్రువీకరించిన కంపెనీ-renault duster 7 seater to be called boreal in non europe markets including india know more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ ను ఇకపై ఈ పేరుతోనే పిలుస్తారు; ధ్రువీకరించిన కంపెనీ

రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ ను ఇకపై ఈ పేరుతోనే పిలుస్తారు; ధ్రువీకరించిన కంపెనీ

Sudarshan V HT Telugu

రెనాల్ట్ డస్టర్ 7 సీటర్ వేరియంట్ ను యూరోప్ మినహా ప్రపంచ మార్కెట్ లో ఏ పేరుతో వ్యవహరించబోతోందో రెనాల్ట్ వెల్లడించింది. భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో డస్టర్ 7 సీటర్ వేరియంట్ ను బోరియల్ అనే పేరుతో వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇది 2027 మధ్యలో భారత మార్కెట్ లో లాంచ్ కానుంది.

రెనాల్ట్ డస్టర్ 7-సీటర్

డస్టర్ ఎస్ యూవీలో రాబోయే ఏడు సీట్ల వెర్షన్ పేరును రెనాల్ట్ ధృవీకరించింది. రెనాల్ట్ డస్టర్ 7 సీటర్ ఎస్ యూవీకి రెనాల్ట్ బోరియల్ అని నామకరణం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఎస్ యూవీ యూరప్ మినహా, అంతర్జాతీయ మార్కెట్లో ఈ పేరుతోనే ఉంటుందని పేర్కొంది. అంటే, ఇండియాలో కూడా ఈ 7 సీటర్ డస్టర్ కు బోరియల్ అని పేరు కొనసాగుతుంది.

భారత్ లో ఎప్పుడు?

రెనాల్ట్ కొత్త తరం డస్టర్ ఎస్ యూవీని 2026 మధ్యలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. డస్టర్ ఒకప్పుడు భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్. ఆ తరువాత క్రమంగా అది భారత మార్కెట్ నుంచి తొలగిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త ఫీచర్లతో పునారగమనం చెందుతోంది. కొత్తగా ఏడు సీట్ల వేరయింట్ ను కూడా తీసుకువస్తున్నారు. డస్టర్ 7 సీటర్ వేరియంట్ లేదా బోరియల్ 2027 లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

లాటిన్ అమెరికా నుంచి..

రెనాల్ట్ బోరియల్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి రానుంది. రెనాల్ట్ కు కంచుకోటగా ఉన్న లాటిన్ అమెరికా మార్కెట్లో దీనిని ప్రారంభించాలని కార్ల తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాతి దశలో కార్ల తయారీ సంస్థ దీన్ని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రెనాల్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ 2027 లో బోరియల్ కీలక పాత్ర పోషిస్తుందని రెనాల్ట్ పేర్కొంది. రెనాల్ట్ బోరియల్ లాటిన్ అమెరికాలో లాంచ్ అవుతుందని, క్రమంగా 70కి పైగా దేశాలకు చేరుకుంటుందని తెలిపింది.

వచ్చే మూడేళ్లలో ఐదు కొత్త కార్లు

వచ్చే మూడేళ్లలో ఐదు కొత్త కార్లను దేశంలో విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ ఇండియా కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. మొదట రెండు నెక్స్ట్ జనరేషన్ కార్లు, ఆ తర్వాత కొత్త ప్లాట్ ఫామ్ ఆధారంగా రెండు కొత్త ఎస్ యూవీలు ఉంటాయి. చివరగా, లైనప్ లో కొత్త ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉంటుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం