Reliance Jio : సియాచిన్లో జియో 5జీ సేవలు- భారత సైన్యానికి ఇక కనెక్టివిటీ సమస్యలు దూరం!
ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భూభాగంలో భారత సైన్యానికి మద్దతుగా సియాచిన్ గ్లేసియర్లో 4జీ, 5జీ కనెక్టివిటీని ప్రారంభించింది రిలయన్స్ జియో. ఇది దేశంతో పాటు టెలికాం రంగంలో కీలక మైలురాయిగా నిలిచింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్లో 4జీ, 5జీ నెట్వర్క్ కనెక్టివిటీని ఏర్పాటు చేసింది దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. దేశంతో పాటు టెలికాం రంగంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఇండియన్ ఆర్మీ సహకారంతో కనెక్టివిటీ సేవలను ఈ ప్రాంతానికి విస్తరించిన తొలి టెలికాం ఆపరేటర్గా పేరు సంపాదించుకుంది. ఆర్మీ సిగ్నలర్ల సహకారంతో జరిగిన ఈ ఏర్పాట్లు దేశానికి ఒక పెద్ద సాంకేతిక విజయంగా కూడా చూడొచ్చు.
16వేల అడుగుల ఎత్తులో 5జీ సేవలు..
జియో తన ఫుల్ స్టాక్ 5జీ టెక్నాలజీని ఉపయోగించి కరకోరం రేంజ్లోని ఫార్వర్డ్ పోస్ట్ వద్ద ప్లగ్ అండ్ ప్లే ప్రీ కాన్ఫిగర్ పరికరాలను విజయవంతంగా ఇన్స్టాల్ చేసింది! లాజిస్టిక్స్ని నిర్వహించే, గ్లేసియర్కి పరికరాలను ఎయిర్లిఫ్ట్ చేయడానికి వీలు కల్పించిన భారత సైన్యంతో కోఆర్డినేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. కఠినమైన వాతావరణం ఉన్నా, ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్కి పడిపోయినా, జియో తాజా సేవలతో 16,000 అడుగుల వద్ద భారత సైన్యానికి నమ్మదగిన కనెక్టివిటీ లభిస్తుంది.
మారుమూల, సవాలుతో కూడిన ప్రదేశాలలో కనెక్టివిటీని అందించి భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి తమ నిబద్ధతను ఈ విజయం హైలైట్ చేస్తుందని జియో చెప్పింది. ఇది భారత సైన్యానికి కమ్యూనికేషన్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను పెంచుతుందని పేర్కొంది.
కీలకమైన సరిహద్దు పోస్టులపై దృష్టి సారించిన రిలయన్స్ జియో.. లద్దాఖ్లో ఇప్పటికే తన నెట్వర్క్ని విస్తరించింది. ఈ కఠినమైన భూభాగాలకు 4జీ సేవలను తీసుకువచ్చిన మొదటి ఆపరేటర్గా నిలిచింది. సాయుధ దళాలు, స్థానిక సమాజాలకు అవసరమైన డిజిటల్ సేవలకు మద్దతు ఇస్తూనే ఉంది.
సియాచిన్లో విజయవంతంగా 5జీని ప్రారంభించడం టెలికాం పరిశ్రమలో ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత రిమోట్ ప్రాంతాలను కూడా అనుసంధానించాలనే జియో సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విజయం దేశ సాంకేతిక పురోగతిని, సాయుధ దళాల అచంచల అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది.
ఉచిత యూట్యూబ్ ప్రీమియం..
మరోవైపు జియో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఉచిత యూట్యూబ్ ప్రీమియం అందిస్తోంది సంస్థ. ఎంపిక చేసిన జియోఫైబర్, జియో ఎయిర్ఫైబర్ పోస్ట్పెయిడ్ ప్లాన్లతో రెండు సంవత్సరాల పాటు యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. రూ.888 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన పోస్ట్పెయిడ్ ప్లాన్లను సబ్స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు ఈ ఆఫర్లో భాగంగా యాడ్ ఫ్రీ యూట్యూబ్, ఆఫ్లైన్ వ్యూస్, యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్ని ఆస్వాదించవచ్చు. భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియంకు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది మంచి ఆఫర్.
సంబంధిత కథనం