Jio True 5G in Eluru : ఏలూరులో జియో 5జీ లాంచ్.. ఏపీలో ఇప్పటి వరకు ఎన్ని నగరాల్లో.. ?
Jio True 5G in Eluru : ఆంధ్రప్రదేశ్ లో జియో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది రిలయన్స్ జియో. తాజాగా ఏలూరులో సేవలను లాంచ్ చేసింది. దీంతో.. ఏపీలో జియో 5జీ ఉన్న నగరాల సంఖ్య ఏడుకి చేరింది.
Jio True 5G in Eluru : దేశంలో అతిపెద్ద టెలికం నెట్ వర్క్ రిలయన్స్ జియో (Reliance Jio) 5జీ సేవల పరిధిని క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జియో 5జీ సర్వీసులు (5G Services) దేశంలోని 100 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ట్రూ 5జీ (True 5G) సర్వీసులను గతేడాది అక్టోబర్లో రిలయన్స్ జియో లాంచ్ చేసింది. 5జీ నెట్వర్క్ రోల్ అవుట్ చేసిన 100 రోజుల్లోనే.. 100 నగరాల్లో ఈ కొత్త తరం నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా విస్తరిస్తూ... ప్రధాన నగరాలు, పట్టణాల్లో సర్వీసెస్ మొదలు పెడుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో.. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో.... తాజాగా ట్రూ 5జీ సేవలను ఏలూరులో జనవరి 14న లాంఛనంగా ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో జియో 5జీ ఉన్న నగరాల సంఖ్య ఏడుకి చేరింది.
ఏలూరులో తో పాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో… ఛత్తీస్గఢ్ (రాయ్పూర్, దుర్గ్, భిలాయ్), బీహార్ (పాట్నా, ముజఫర్పూర్), జార్ఖండ్ (రాంచీ, జంషెడ్పూర్), కర్ణాటక (బీజాపూర్, ఉడిపి, కలబురగి, బళ్లారి), ఒడిశా (రూర్కెలా, బ్రహ్మపూర్), కేరళ (కొల్లం), మహారాష్ట్ర (అమరావతి) లో జియో ట్రూ 5G సేవలు ప్రారంభం అయ్యాయి.
ఈ ఏడాది చివరి కల్లా ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరాలు, మండలాలు, గ్రామాల్లో 5జీని అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించింది. 5జీ కోసం ఏపీలో అదనంగా రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
తెలంగాణలో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
జియో ప్రస్తుతం 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీంట్లో భాగంగా జియో 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5జీ ఫోన్లు వాడుతున్న వారు ఉచితంగా అన్లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.