UPI apps update: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ లను ప్రభావితం చేసే కొత్త నిబంధనలను 2025 ఏప్రిల్ 1 నుంచి తీసుకురానుంది. యూపీఐతో లింక్ అయిన మొబైల్ నంబర్లు ఎక్కువ కాలం యాక్టివ్ గా లేకపోతే వాటిని బ్యాంకు ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. అంటే, ఒకవేళ, మీ బ్యాంక్ అకౌంట్ కు ఇన్ యాక్టివ్ గా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే, ఆ బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానమై ఉన్న యూపీఐ యాప్స్ పని చేయవు.
రోజురోజుకూ సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో ఎన్ పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలను సృష్టిస్తున్నాయని పేర్కొంది. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయిస్తే, ఇది మోసానికి వీలు కల్పిస్తుంది. అందువల్ల, యుపిఐ లావాదేవీలను సులభంగా నిర్వహించడానికి యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్ అవసరం. అలాగే, ఆ నంబర్ ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి.
సాధారణంగా, నిర్దిష్ట కాలం పాటు రీ చార్జ్ చేయని మొబైల్ నంబర్లను టెలీకాం ప్రొవైడర్లు డీ యాక్టివేట్ చేస్తారు. ఆ తరువాత, కొంత కాలం తరువాత వాటిని వేరే కస్టమర్లకు కేటాయిస్తారు. ఒకవేళ, ఆ నంబర్ గత కస్టమర్ కు చెందిన బ్యాంక్ ఖాతాలో లింక్ అయి ఉంటే, ఆ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్లను యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ, తమ మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉందో, లేదో తెలుసుకోవడానికి సంబంధిత టెలికాం ప్రొవైడర్ను సంప్రదించాలి. ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను ప్రతి వారం సవరించాలని బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్లకు ఎన్ పీసీఐ సూచించింది.
సంబంధిత కథనం