డబ్బు అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి. వాటిల్లో ఒకటి ‘ప్రాసెసింగ్ ఫీజు’. ఈ అంశాన్ని అస్సలు విస్మరించకూడదు. మొత్తం రుణ మొత్తంలో ఇది 2-3 శాతం వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి, పర్సనల్ లోన్ విషయంలో ప్రాసెసింగ్ ఫీజు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ప్రాసెసింగ్ ఫీజు అంటే ఏంటి? అది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? దేశంలోని టాప్ బ్యాంకులు.. పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రుణ దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం రుణగ్రహీత నుంచి బ్యాంకు వసూలు చేసే వన్ టైమ్ ఫీజు ఇది. సాధారణంగా ఇది.. మీకు ఇచ్చే లోన్లో నుంచే కట్ అవుతుంది. మిగిలిన రుణ డబ్బు మాత్రమే మకు ఇస్తారు.
ఉదాహరణకు ఎవరైనా రూ.10 లక్షల పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం అనుకుంటే, రూ.20,000 ప్రాసెసింగ్ ఛార్జీలు మినహాయించిన తర్వాత బ్యాంకు రూ.9.8 లక్షలు బదిలీ చేస్తుంది!
1. కొన్నిసార్లు, బ్యాంకులు కొంచెం తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ని అందిస్తాయి. కానీ ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ వడ్డీ రేటు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
2. ఒక బ్యాంకు తక్కువ వడ్డీ రేటును వసూలు చేసినప్పుడు, ప్రాసెసింగ్ ఫీజు కూడా అంతే తక్కువగా ఉంటే, మొత్తం డీల్ రుణ దరఖాస్తుదారుడికి చాలా ఆకర్షణీయంగా మారుతుంది. ఇది మంచి విషయం.
3. ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించిన తరువాత మాత్రమే లోన్ డబ్బు బదిలీ అవుతుంది కాబట్టి - అధిక ఛార్జీలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎంత డబ్బు కావాలనుకుంటున్నామో, దాని కన్నా కాస్త ఎక్కువ రుణానికే అప్లై చేయాల్సి వస్తుంది. ఇది నెగిటివ్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. ఒక్కోసారి ఈఎంఐల భారం పెరిగిపోతుంది.
పర్సనల్ లోన్ విషయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ .6,500 + వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ప్రాసెసింగ్ ఫుజుగా వసూలు చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మొత్తంలో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలుగా వసూలు చేస్తుంది.
కోటాక్ మహీంద్రా బ్యాంక్ రుణ మొత్తంలో 5 శాతం పన్నును ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ ప్రజల నుంచి ప్రాసెసింగ్ ఛార్జీల రూపంలో పర్సనల్ లోన్ మొత్తంలోని 1 శాతం వసూలు చేస్తుంది. డిఫెన్స్ సిబ్బందికి ఎలాంటి ఛార్జీలు ఉండవు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ మొత్తంలో 1.50 శాతం ప్రాసెసింగ్ ఛార్జీలుగా వసూలు చేస్తుంది, కనీస ఛార్జీలు రూ .1,000 (ప్లస్ జీఎస్టీ), గరిష్టంగా రూ .15,000 (ప్లస్ జీఎస్టీ)!
సంబంధిత కథనం