Paytm: పేటీఎంకు ఊరట; థర్డ్ పార్టీ యూపీఐ యాప్ గా కొనసాగేందుకు ఎన్పీసీఐ అనుమతి
Paytm UPI: సంక్షోభంలో ఉన్న డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం నకు ఊరట కల్పించే నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) తీసుకుంది. పేటీఎం ను థర్డ్ పార్టీ యాప్ గా కొనసాగించేందుకు ఎన్పీసీఐ అంగీకరించింది. అంటే, యూజర్లు మార్చి 15 తరువాత కూడా పేటీఎం ద్వారా డిజిటల్ లావాదేవీలు కొనసాగించవచ్చు.
పేటీఎం థర్డ్ పార్టీ యాప్: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా యూపీఐ సేవల్లో పాల్గొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి ఇచ్చింది. పేటీఎం కోసం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (PSP)గా నాలుగు బ్యాంకులు భాగస్వామ్య బ్యాంకులుగా పనిచేస్తాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ ఉన్నాయి.

పేటీఎం థర్డ్ పార్టీ యాప్: ఎన్పీసీఐ ఏం చెప్పింది?
‘‘పేటీఎంలో ఇప్పటికే ఉన్న, కొత్త యూపీఐ వ్యాపారులకు మర్చంట్ కొనుగోలు బ్యాంకుగా యెస్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. @Paytm" హ్యాండిల్ యస్ బ్యాంక్ కు రీడైరెక్ట్ చేయబడుతుంది. ఇది ఇప్పటికే ఉన్న వినియోగదారులు మరియు వ్యాపారులు యూపీఐ లావాదేవీలు, ఆటోపే ఆదేశాలు నిరంతరాయంగా కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఎన్పీసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పేటీఎం యాప్ లో ఉన్న అన్ని హ్యాండిల్స్ ను, అవసరమైన చోట కొత్త పీఎస్పీ బ్యాంకులకు మైగ్రేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని పేటీఎంకు రెగ్యులేటర్ సూచించింది.
పేటీఎం థర్డ్ పార్టీ యాప్ అంటే ఏమిటంటే..
నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించింది. మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో పేటీఎం బ్యాంకింగ్ విభాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 నుంచి ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించలేదు. అయితే, తాజాగా, ఎన్పీసీఐ ఇచ్చిన వెసులుబాటు కారణంగా, మార్చి 15 తరువాత కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చెల్లింపుల కోసం వినియోగదారులు పేటీఎం యాప్ ను ఉపయోగించవచ్చు.
మార్చి 15 పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గడువు
2024 జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన నేపథ్యంలో మార్చి 15 తర్వాత అనేక పేటీఎం సేవలు పనిచేయవు. మార్చి 15 తర్వాత పీబీబీఎల్ కొత్త డిపాజిట్లు, టాప్-అప్లను స్వీకరించకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.