ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో చాలా రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్టోబర్ 9న బుధవారం రాత్రి 11.30 గంటలకు 86 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. అధిక రక్తపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఈ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. ఈ విషయమై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ మరణ వార్తను ధృవీకరించారు.
మనం చాలా నష్టపోయాం, రతన్ నావల్ టాటాకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని చంద్రశేఖరన్ అన్నారు. పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. 'గడియారం ఆగింది. టైటాన్ మనల్ని విడిచిపెట్టింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వంతో ఒక వెలుగు వెలిగారు. వ్యాపార ప్రపంచంలో, బయట చెరగని ముద్ర వేశారు. అవి మన జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' హర్షా గోయెంకా అన్నారు. తర్వాత రతన్ టాటా మృతిపై రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్కక్తం చేశారు.
రతన్ టాటా మరణ వార్త తెలియగానే ముంబై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. భద్రత దృష్ట్యా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అర్థరాత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. మూడు రోజుల కిందటం టాటా ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నానని రతన్ టాటా ప్రకటించారు.
ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని పుకార్లు వ్యాపించడంతో వివరణ ఇచ్చారు. రతన్ టాటా అన్ని పుకార్లను కొట్టిపారేశారు. 'నా ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన పుకార్ల గురించి నాకు తెలుసు. ఈ పుకార్లు నిరాధారమైనవి. సాధారణ చెకప్లో భాగంగా ఆసుపత్రికి వచ్చాను. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానేయాలని అభ్యర్థిస్తున్నాను.' రతన్ టాట్ చెప్పారు.
1962లో టాటా స్టీల్లో పనిచేస్తూ తన జీవితాన్ని ప్రారంభించారు. 1970లో టాటా కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టారు రతన్ టాటా. 1991లో టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. డిసెంబరు 2012లో తన పదవుల నుంచి పదవీ విరమణ చేశారు. సాదాసీదా జీవితాన్ని గడుపుతూ టాటాను పెద్ద కంపెనీగా తీర్చిదిద్దారు. అలాగే టాటా కంపెనీ జాగ్వార్తో సహా అనేక విదేశీ బ్రాండ్ కార్ల తయారీ కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన నాయకత్వంలో టాటా నిజంగా 100 బిలియన్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.
రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఆయనకు ఓ మంచి ప్రేమకథ ఉంది. అమెరికాలో ఓ యువతితో ప్రేమలో పడ్డారు రతన్ టాటా. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అయితే ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా భారత్కు వచ్చారు. ఆ సమయంలో భారత్ చైనా యుద్ధంతో యువతి భారత్ వచ్చేందుకు అనుమతి దొరకలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసిపోయింది. తర్వాత రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు.
టాపిక్