సీఎన్జీ కారు అనగానే దేశంలో మెుదటగా గుర్తుకువచ్చేది మారుతి. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలో మొత్తం 17 మోడళ్లు ఉన్నాయి. ఇందులో 1 డజనుకు పైగా కార్లు సీఎన్జీతో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. మారుతి సీఎన్జీ కార్ల మైలేజ్ కూడా అత్యధికంగా ఉంది. ఈ కారణంగానే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు దేశవ్యాప్తంగా కస్టమర్లు బారులు తీరారు. మారుతి సుజుకి 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,795,259 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇందులో మారుతి సీఎన్జీ అమ్మకాలు 6.20 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంటే గత ఏడాది విక్రయించిన ప్రతి మూడింటిలో ఒకటి సీఎన్జీ కారు. సీఎన్జీ వాహన విక్రయాల్లో కంపెనీ 28 శాతం వృద్ధిని సాధించింది.
మారుతి సుజుకి దేశంలో అతిపెద్ద సీఎన్జీ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ఇందులో 13 వాహనాలు ఉన్నాయి. జిమ్నీ, ఇగ్నిస్, ఇన్విక్టో అనే మూడు కార్లు మినహా.. అన్ని మారుతి కార్లు, ఎస్యూవీలకు ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్లను అందిస్తున్నారు. కంపెనీకి సీఎన్జీ మార్కెట్లో బలమైన పట్టు ఉంది. 2024 చివరి నాటికి మారుతి సుజుకి సీఎన్జీ విభాగంలో 71.60 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా మోటార్స్ 16.13 శాతం, హ్యుందాయ్ 10.04 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. టయోటా కూడా సీఎన్జీ విభాగంలో 2.21 శాతం మార్కెట్ వాటాతో కొంత ఉనికిని కలిగి ఉంది.
మారుతి సీఎన్జీ కార్ల మైలేజ్ చాలా అద్భుతంగా ఉంది. సెలెరియో సీఎన్జీ వేరియంట్ కిలోకు 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం అమ్మకాల ఫలితాలలో బలమైన ఈ హైబ్రిడ్ వాహనం 20,672 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో దాని మొత్తం అమ్మకాలలో 2.4 శాతం. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం వార్షిక పెరుగుదల.
టాటా మోటార్స్ సీఎన్జీ అమ్మకాలకు కచ్చితమైన గణాంకాలను ఇవ్వలేదు. కానీ సీఎన్జీ వాహనాల అమ్మకాలలో సంవత్సరానికి 35 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్ మొత్తం పరిమాణం పరంగా సీఎన్జీ అమ్మకాలలో రెండో స్థానంలో ఉంది. కంపెనీ డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీ.. సీఎన్జీ వాహనాల ప్రధాన సమస్యలలో ఒకటైన బూట్ స్పేస్ను పరిష్కరించింది.
సంబంధిత కథనం