Ola Electric Scooters Price Hike: షాకిచ్చిన ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల పెంపు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..!
Ola Electric Scooters Price Hike: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పెరిగాయి. ఎస్1, ఎస్1 ప్రో మోడళ్ల రేట్లను పెంచింది ఓలా ఎలక్ట్రిక్. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
Ola Electric Scooters Price Hike: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ధరలను పెంచింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లను అధికం చేసింది. సేల్స్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్ టాప్లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. తాజాగా ఒక్కో స్కూటర్పై రూ.15వేల వరకు ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఫేమ్-2 పథకం కింద వచ్చే సబ్సిడీని ప్రభుత్వం జూన్ 1 నుంచి 15 శాతానికి తగ్గించటంతో రెండు మోడళ్లపై ధరలను పెంచుతూ ఓలా ఎలక్ట్రిక్ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. ధరల పెరుగుదల తర్వాత ఓలా స్కూటర్ల ధరలు ఎలా ఉన్నాయంటే..
ట్రెండింగ్ వార్తలు
ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కు చేరింది. ఈ 3kWh మోడల్ రేటు మే వరకు రూ.1.15లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అంటే ఈ రేటు సుమారు రూ.15వేలు పెరిగింది. ఈ ఎస్1 స్కూటర్లో 3kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 141 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు (95 kmph)గా ఉంది.
ఇక, ఈ కంపెనీ నుంచి ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్గా ఉన్న ఓలా ఎస్1 ప్రో మోడల్ ధర కూడా రూ.15వేలు పెరిగింది. ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మే వరకు ఈ రేటు రూ.1.24,999 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఓఎస్ ఎస్1 ప్రో స్కూటర్లో 4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 181 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. 116 kmph టాప్ స్పీడ్గా ఉంది. ఇక ఆన్రోడ్కు వచ్చే సరికి మరింత ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు.
మరోవైపు ప్రస్తుతం ఓలా ఎస్1 2 kWh బ్యాటరీ వేరియంట్ బుకింగ్లను ఓలా ఎలక్ట్రిక్ నిలిపివేసింది. కొత్త ధరతో 3kWh బ్యాటరీ వెర్షన్ను అందుబాటులో ఉంచింది.
మరికొన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థలు కూడా ధర పెంపునకు సిద్ధపడ్డాయి. ఏథెర్ ఎనర్జీ సంస్థ.. తన ఏథెర్ 450ఎక్స్ స్కూటర్ ధర మే 31 తర్వాత రూ.32,500 వరకు పెరగనుందని ఇటీవలే ప్రకటించింది. ఇక మ్యాటర్ ఎయిరా ఎలక్ట్రిక్ బైక్ ధరలు కూడా పెరగనున్నాయి.
ఫేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ టూవీలర్ల ఎక్స్-ఫ్యాక్టరీ ధరపై మే వరకు గరిష్టంగా 40 శాతం వరకు సబ్సిడీని ఇచ్చేది ప్రభుత్వం. దాన్ని జూన్ 1 నుంచి 15 శాతానికి తగ్గించింది. ప్రతీ కిలో వాట్ హవర్పై సబ్సిడీని రూ.5,000 తగ్గించి రూ.10,000 చేసింది. దీంతో తయారీ సంస్థలు ఇక ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరలను పెంచుతున్నాయి.
సంబంధిత కథనం