దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది! మార్చ్తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో అతిపెద్ద నష్టాలను నమోదు చేసింది. 25ఏళ్లల్లోనే అత్యధిక నష్టాలను నమోదు చేయడంతో కాస్ట్ కటింగ్ చర్యలను ప్రకటించి 7 ఫ్యాక్టరీలు మూసివేస్తున్నట్టు, 20వేలకుపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
మార్చ్తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో నిస్సాన్ ఏకంగా 670.9 బిలియన్ యెన్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు, 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంచనాలను కూడా చెప్పేందుకు వెనకాడింది!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. నిస్సాన్ని దివాళా నుంచి ఆదుకున్న 25ఏళ్లల్లో పరిస్థితులు ఈ స్థాయిలో దిగజారిపోవడం ఇదే తొలిసారి.
భారీ నష్టాల నేపథ్యంలో నిస్సాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం 17గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్యను 2027 ఆర్థిక ఏడాది నాటికి 10కి తగ్గించనున్నట్టు వెల్లడించింది. గతేడాది 3.5 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఉత్పత్తిని 2.5 మిలియన్కి తగ్గించనున్నట్టు స్పష్టం చేసింది. 20వేల ఉద్యోగాలను తీసేస్తున్నట్టు పేర్కొంది. వీటి వల్ల 500 బిలియన్ యెన్ ఖర్చు తగ్గుతుందని సంస్థ భావిస్తోంది.
అమెరికా, చైనాలో సేల్స్ సరిగ్గా జరగకపోతుండటం నిస్సాన్ని భారీగా దెబ్బకొట్టింది. హోండా మోటార్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.
నిస్సాన్ భవితవ్యం ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓ ఇవాన్ ఎస్పినోసాపై ఆధారపడి ఉంది. మాజీ సీఈఓ మకోటా ఉచిడా జాబ్స్ కట్ చేసి ఖర్చులు తగ్గించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో ఇవాన్ చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. "వాస్తవం చాలా స్పష్టంగా ఉంది. నిస్సాన్ సంస్థ స్వీయ అభివృద్ధివైపు వేగంగా, అర్జెంటుగా అడుగులు వేయాలి," అని ఇవాన్ అన్నారు.
కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన టారీఫ్ రూపంలో నిస్సాన్పై మరో పిడుగు పడింది. యూఎస్ టారీఫ్ వల్ల కంపెనీకి మొత్తం మీద 450 బిలియన్ యెన్ నష్టం వాటిల్లుతుందని సంస్థ చెప్పింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా వేసిన 200 బిలియన్ యెన్ నష్టానికి ఇది అదనపు భారం!
నిస్సాన్కి సంబంధించి అమెరికాలో 45శాతం సేల్స్ ఎగుమతుల రూపంలోనే జరుగుతున్నాయి. ఇవి మెక్సికో, జపాన్ నుంచి అమెరికాకు వెళుతున్నాయి. ట్రంప్ తాజా చర్యలతో మెక్సికోకు చెందిన 3లక్షల యూనిట్లు, జపాన్కి చెందిన 1.2లక్షల యూనిటల్పై ప్రతికూల ప్రభావం పడుతుందని నిస్సాన్ సీఎఫ్ఓ జెరేమి పాపిన్ స్వయంగా చెప్పారు.
ట్రంప్ టారీఫ్ పిడుగుతో నిస్సాన్ మాత్రమే కాదు, అనేక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు తమ లాభాల అంచనాలను సవరించుకున్నాయి.
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్కి నిస్సాన్లో 36శాతం వాటా ఉంది. నిస్సాన్ తాజా సంక్షోభంతో, ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో రెనాల్ట్కి 2.2 బిలియన్ యూరోల (ఆదాయం) నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా ఇండియా, యూరోప్, లాటిన్ అమెరికాలో బిజినెస్ కోసం రెనాల్ట్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు నిస్సాన్ ప్రయత్నిస్తోంది. అమెరికాలో హోండాతో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తోంది.
సంబంధిత కథనం