Earthquake today : మయన్మార్​లో భారీ భూకంపం, బ్యాంకాక్​లో ప్రకంపనలు.. అంతా అల్లకల్లోలం!-myanmar earthquake today 7 7 magnitude quake hits indias neighbour ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake Today : మయన్మార్​లో భారీ భూకంపం, బ్యాంకాక్​లో ప్రకంపనలు.. అంతా అల్లకల్లోలం!

Earthquake today : మయన్మార్​లో భారీ భూకంపం, బ్యాంకాక్​లో ప్రకంపనలు.. అంతా అల్లకల్లోలం!

Sharath Chitturi HT Telugu

Myanmar earthquake today : మనయ్మార్​లో భారీ భూకంపం సంభవించింది. కాగా పొరుగున ఉన్న థాయ్​లాండ్​లోనూ తీవ్ర ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకాక్​లో భవనం కూలిన దృశ్యాలు వైరల్​ అయ్యాయి.

భూ ప్రకంపనలకు బ్యాంకాక్​లో కూలిన భవనం..

భారీ భూకంపాల ఘటనలతో ఆగ్నేయ ఆసియా ఉలిక్కిపడింది! మయన్మార్​లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. పొరుగున ఉన్న థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లోనూ భూమి కంపించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలను సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అవి భయానకంగా ఉన్నాయి.

మయన్మార్​లో భూకంపం..

సెంట్రల్​ మయన్మార్​లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్​ జియోలాజికల్​ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు సగింగ్ నగరానికి వాయవ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్లు యూఎస్​జీఎస్ తెలిపింది.

అయితే ఈ మొదటి భారీ భూకంపం తర్వాత మయన్మార్​లో రెండోసారి ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 12 నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మళ్లీ భూప్రకంపనలు నమోదయ్యాయి.

దేశంలోనే అతిపెద్ద నగరమైన యంగాన్​లో కూడా ప్రకంపనలు భయపెట్టాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మయన్మార్​లో భారీ భూకంపాలు ఎప్పటికప్పుడు ప్రజలను భయపెడుతుంటాయి. 1930 నుంచి 1956 మధ్యలో 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భారీ భూకంపాలు సగింగ్​ ప్రాంతంలో, సమీపంలో సంభవించాయి. 2016లో బగన్​ నగరంలో సంభవించిన భూకంపంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లో ప్రకంపనలు..

మయన్మార్​ పొరుగున ఉన్న థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 10 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్​జీఎస్​, జర్మనీ జీఎఫ్​జెడ్​ సెంటర్​ ఫర్​జియోసైన్స్​లు వెల్లడించాయి.

గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతంలో 17 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో అనేక ఎత్తైన అపార్ట్​మెంట్లు ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో భవనాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా ప్రజలను జనసాంద్రత ఎక్కువగా ఉండే సెంట్రల్ ఏరియాలోని ఎత్తైన హోటళ్లు, మెట్ల ద్వారా ఖాళీ చేయించారు. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.

బ్యాంకాక్​లో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారని, స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు బయటకు చిమ్మిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బలమైన ప్రకంపనలకు థాయ్​లాండ్​లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఉత్తర, మధ్య థాయ్​లాండ్ అంతటా భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రముఖ పర్యాటక నగరం చియాంగ్ మాయి నివాసి దువాంగ్జాయ్ ఏఎఫ్​పీతో మాట్లాడుతూ.. "నేను ఇంట్లో నిద్రపోతున్నాను, నేను భవనం నుంచి సాధ్యమైనంత వేగంగా పరుగు తీసి బయటపడ్డాను," అని చెప్పారు.

మయన్మార్​ భూకంపం, బ్యాంకాక్​ భూ ప్రకంపనల్లో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలపై ప్రస్తుతానికి సమాచారం లేదు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.