Rooftop solar scheme: ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టనున్న ఈ ‘‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’’ ద్వారా కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని మొదట ప్రకటించారు.
ఈ సోలార్ ప్యానెల్ పథకం (Rooftop solar scheme) కింద లబ్దిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సబ్సీడీని ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఇవ్వనున్నామన్నారు. అలాగే, రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. ‘‘పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద ఇల్లు లేదా భవనం రూఫ్ టాప్ పై సోలార్ ఫోటోవోల్టాయిక్ (P) ప్యానెల్స్ ను అమరుస్తారు.
ఈ పథకానికి లబ్దిదారులుగా చేరాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వెబ్ సైట్ లో ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు.