మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్; 2023 తరువాత మళ్లీ ఇప్పుడే అత్యధికంగా ఉద్యోగుల తొలగింపు-microsoft announces another round of lay off this is the biggest round of job cuts since 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్; 2023 తరువాత మళ్లీ ఇప్పుడే అత్యధికంగా ఉద్యోగుల తొలగింపు

మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్; 2023 తరువాత మళ్లీ ఇప్పుడే అత్యధికంగా ఉద్యోగుల తొలగింపు

Sudarshan V HT Telugu

మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. 2023 తరువాత మళ్లీ అత్యధికంగా, సుమారు 6 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వీడియో గేమింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ బాక్స్, దాని కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ పై కూడా ఉద్యోగాల కోత ప్రభావం చూపుతోంది.

మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్ (AFP)

టెక్ రంగంలో భారీ తొలగింపుల పరంపరను కొనసాగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు మళ్లీ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్లో 3% గా ఉంటుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ప్రకటన వెలువడింది.

2023 తరువాత..

2023లో మైక్రోసాఫ్ట్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. సంస్థలో ఇది రెండో అతిపెద్ద ఉద్యోగ కోత. పోటీని తట్టుకునేందుకు టెక్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించడంతో, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అనివార్యమైంది. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తుండగా, వీరిలో 55 శాతం మంది అమెరికాలోనే ఉన్నారు.

యూఎస్ ఆఫీస్ నుంచే ఎక్కువ..

ఈ రౌండు ఉద్యోగాల కోత వల్ల ఎక్కువగా ప్రభావితమైన భౌగోళిక ప్రాంతాలలో వాషింగ్టన్ ఒకటి. ఇక్కడ 1,985 మంది ఉద్యోగులను రెడ్మండ్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లమని అడుగుతున్నారని ఎపి నివేదిక తెలిపింది. ఈ ఉద్యోగుల్లో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ లేదా ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ రోల్స్ లో ఉన్నారు. ప్రస్తుత లే ఆఫ్ ప్రక్రియ అన్ని టీమ్స్, లెవెల్స్, అన్ని కేటగిరీస్, అన్ని భౌగోళిక ప్రాంతాలలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ లే ఆఫ్ తో ప్రధానంగా కంపెనీలో మేనేజర్ల సంఖ్యను తగ్గించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఉద్యోగాల కోత మైక్రోసాఫ్ట్ వీడియో గేమింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ బాక్స్, దాని కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ పై కూడా ప్రభావం చూపుతుంది.

సంస్థాగత మార్పుల్లో భాగంగా..

డైనమిక్ మార్కెట్లో కంపెనీ విజయానికి అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉన్నామని ఉద్యోగ కోతకు గల కారణాలపై కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో వాల్ స్ట్రీట్ అంచనాలను మించిన అమ్మకాలు, లాభాలను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 70.1 బిలియన్ డాలర్ల ఆదాయం, 25.8 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం