భారత దేశంలో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ కామెట్ ఈవీ ఒకటి. ఇక ఇప్పుడు, ఈ ఈవీ ధరలను జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ పెంచింది. వేరియంట్ను బట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ. 15,000 వరకు పెరిగింది. మే 2025లో బ్రాండ్ విధించిన మునుపటి ధరల పెంపు తర్వాత ఇది రెండోసారి. ఈ ధరల పెంపుతో పాటు కంపెనీ బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ అద్దె ధరలు కూడా ప్రభావితం కానున్నాయి.
ఎక్స్-షోరూమ్ ధరల పెంపుతో పాటు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ తమ BaaS సబ్స్క్రిప్షన్ రుసుమును కిలోమీటర్కు రూ. 2.90 నుంచి రూ. 3.10కి పెంచింది. ఈ పెంపు చిన్నదిగా కనిపించినా.. ప్రతి 1,000 కి.మీ.కు అదనంగా రూ. 200 భారం పడుతుంది. తరచుగా వాహనం వాడే వారికి ఇది కాలక్రమేణా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వాహనం నిర్వహణ ఖర్చుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ఎగ్జిక్యూటివ్: పాత ధర రూ. 7.36 లక్షలు- కొత్త ధర రూ. 7.50 లక్షలు
ఎగ్జైట్: పాత ధర రూ. 8.42 లక్షలు- కొత్త ధర రూ. 8.57 లక్షలు
ఎగ్జైట్ ఫాస్ట్ ఛార్జింగ్: పాత ధర రూ. 8.82 లక్షలు- కొత్త ధర రూ 8.97 లక్షలు
ఎక్స్క్లూజివ్: పాత ధర రూ. 9.41 లక్షలు- కొత్త ధర రూ. 9.56 లక్షలు
ఎక్స్క్లూజివ్ ఫాస్ట్ ఛార్జింగ్: పాత ధర రూ. 9.83 లక్షలు- కొత్త ధర రూ. 9.97 లక్షలు
బ్లాక్స్టార్మ్ ఎడిషన్: పాత ధర రూ. 9.86లక్షలు- కొత్త ధర రూ. 10లక్షలు
(పైన చెప్పినవి ఎక్స్షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి)
సీటీ డ్రైవ్కి బెస్ట్ అని పేరు తెచ్చుకున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం ధరల పెంపు ఉన్నప్పటికీ, కామెట్ ఈవీ ఫీచర్ల జాబితాలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికీ రెండు 10.25-ఇంచ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా పనిచేస్తే, మరొకటి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఈ జాబితాలో 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, మాన్యువల్ ఏసీ, ఎలక్ట్రిక్గా ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు, పవర్ విండోస్, పుష్-బటన్ స్టార్ట్తో కూడిన కీలెస్ ఎంట్రీ వంటివి ఉన్నాయి.
ప్రయాణికుల భద్రత కోసం, ఎంజీ కామెట్ ఈవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీకి పవర్ని అందించేది 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ.ల వరకు రేంజ్ని ఇస్తుంది. బ్యాటరీ నుంచి విద్యుత్ ఒక ఎలక్ట్రిక్ మోటారుకు బదిలీ అవుతుంది. ఇది 42 హెచ్పీ పవర్ని, 110 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత, 3.3కేడబ్ల్యూ ఛార్జర్తో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5.5 గంటలు పడుతుంది. అయితే 100 శాతం ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుంది.
సంబంధిత కథనం