Stock market : ‘మార్వలెస్​ మండే’- అదరగొట్టిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. భారీ లాభాలకు కారణాలు ఇవే..-marvellous monday for the indian stock market nifty 50 touches green in ytd ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ‘మార్వలెస్​ మండే’- అదరగొట్టిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. భారీ లాభాలకు కారణాలు ఇవే..

Stock market : ‘మార్వలెస్​ మండే’- అదరగొట్టిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. భారీ లాభాలకు కారణాలు ఇవే..

Sharath Chitturi HT Telugu

Stock market today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దుమ్మురేపాయి. దాదాపు ప్రతి ఇండెక్స్​ భారీ లాభాలను నమోదు చేసింది. బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 2.3శాతం లాభపడింది. ఈ మార్కెట్​ గ్రోత్​కి కారణం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ టుడే..

భారత స్టాక్​ మార్కెట్​లలో ‘మార్వలెస్​ మండే’! దాదాపు ఆరు నెలలుగా దేశీయ స్టాక్​ మార్కెట్​లో నష్టాల పరంపరను చూసి, తట్టుకున్న ఇన్వెస్టర్లకు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ద్వారా మంచి రివార్డు లభించింది. సెన్సెక్స్​, నిఫ్టీ50, బ్యాంక్​ నిఫ్టీ, స్మాల్​ క్యాప్​, మిడ్​క్యాప్​తో పాటు దాదాపు అన్ని ఇండెక్స్​లు భారీ లాభాల్లో ముగిశాయి. మరీ ముఖ్యంగా.. ఇయర్​ టు డేట్​ (వైటీడీ)లో నిఫ్టీ50, బ్యాంక్​ నిఫ్టీలు తొలిసారి గ్రీన్​లోకి రావడం ఇన్వెస్టర్స్​ని మరింత సంతోషపెట్టే విషయం. మరి దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి?

వైటీడీలో గ్రీన్​లోకి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 1.40శాతం పెరిగి 77,984.38 వద్ద ముగిసింది. వైటీడీలో లాభాల్లోకి వచ్చేందుకు సెన్సెక్స్​ ఇంకా 0.6శాతం పెరగాల్సి ఉంది.

నిఫ్టీ50 సైతం 1.39శాతం లాభపడి 23,658.35కు చేరింది. 2024 డిసెంబర్​ 31న (23,644) తర్వాత నిఫ్టీ50 వైటీడీలో గ్రీన్​లోకి వచ్చింది. అక్కడి నుంచి కాస్త పాయింట్లు కోల్పోయి, వైటీడీకి 0.3శాతం దూరంలో క్లోజ్​ అయ్యింది.

ఇక బ్యాంక్​ నిఫ్టీ సోమవారం విజృంభించిందనే చెప్పుకోవాలి. 2.3శాతం పెరిగి 51,704.95 వద్ద స్థిరపడింది. 2024 డిసెంబర్​ 31 (50,860) తర్వాత వైటీడీని టచ్​ చేసింది బ్యాంక్​ నిఫ్టీ.

భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు పెరుగుతోంది?- 5 కారణాలు..

1] మెరుగైన క్యూ4 ఫలితాలు- ఈ క్యూ4 ఫలితాలు మెరుగ్గా ఉంటాయని మార్కెట్​లో అంచనాలు మొదలవ్వడం లాభాలకు ఒక కారణం.

“ఎఫ్​వై26, 27లో క్యాపిటల్​ స్పెండింగ్​ పెరుగుతుందని ఫిచ్​ రేటింగ్స్​ అంచనా వేయడంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. 2024 సెప్టెంబర్​లో జీడీపీ తగ్గినప్పటికీ, డిసెంబర్​ నాటికి పుంజుకుంది. అదే విధంగా క్యూ4లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి,” అని ప్రాఫిట్​మార్ట్​ సెక్యూరిటీస్​ రీసెర్చ్​ హెడ్​ అవినాశ్​ గోరఖ్​కర్​ తెలిపారు.

2. ఆర్బీఐ రెట్​ కట్​పై బజ్​- గత వారం యూఎస్ ఫెడ్ సమావేశం తర్వాత ఆర్బీఐ రేట్ల కోతపై వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ప్రాఫిట్​మార్ట్​ సెక్యూరిటీస్​కి చెందిన అవినాష్ గోరఖ్​కర్​ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 2025లో జరగబోయే ఆర్బీఐ పాలసీ సమావేశంలో మార్కెట్ రేట్​ కట్​ని ఆశిస్తోంది. ఆర్బీఐ రేట్ల కోత వల్ల మార్కెట్​లో మరింత లిక్విడిటీ ఉండే అవకాశం ఉన్నందున, దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు బలమైన కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు,” అని అన్నారు.

గత వారం ప్రచురించిన మోర్గాన్ స్టాన్​లీ నివేదిక ఫలితాన్ని హైలైట్ చేస్తూ.. “భారతదేశ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 4% ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) రేటు కోతకు మార్గం సుగమం చేస్తుందని,” గోరక్ష్కర్ అన్నారు.

3. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు : నాణ్యమైన స్టాక్స్ మంచి వాల్యూయేషన్​లో లభిస్తున్న కారణంగా డీఐఐలు, ఎఫ్ఐఐలు ఇద్దరూ కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. 2025 మార్చ్​లో కొన్ని సెషన్లు మినహా, డీఐఐలు నగదు విభాగంలో నిరంతరం కొనుగోళ్లు జరిపారు. గత శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి, డీఐఐలు నగదు విభాగంలో రూ. 30,788.19 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, ఎఫ్ఐఐలు రూ. 15,412.13 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించడం ద్వారా నికర అమ్మకందారులుగా మిగిలిపోయారు. క్యాష్​ మార్కెట్​లో రూ.5,819.12 కోట్ల విలువైన దలాల్ స్ట్రీట్ లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు గత వారం కొనుగోళ్లు ప్రారంభించారు.

ఆకర్షణీయ వాల్యుయేషన్లు, ఆర్థిక రికవరీ సంకేతాల మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్​లోకి తిరిగి రావడంతో ఈ పెరుగుదల జోరు కొనసాగుతుందని భావిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ - వెల్త్ మేనేజ్​మెంట్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు.

4. భారత ఆర్థిక వ్యవస్థపై బలమైన దృక్పథం: గత గురువారం ప్రచురించిన మోర్గాన్ స్టాన్​లో నివేదిక ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలో మూడొవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.7 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల అదనపు రేట్ల కోతకు అవకాశం కల్పిస్తుందని మోర్గాన్ స్టాన్​లీ నివేదిక పేర్కొంది. గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ భారతదేశ సీపీఐ ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 4% ఉంటుందని అంచనా వేసింది. జనవరి-మార్చి 2025 త్రైమాసికంలో, మోర్గాన్ స్టాన్​లీ నివేదిక సీపీఐ ద్రవ్యోల్బణాన్ని దాని మునుపటి అంచనా 4.5% నుంచి సగటున 4% తగ్గించింది. సీపీఐని ఆర్బీఐ 2-6% పరిధిలో లక్ష్యంగా చేసుకున్నందున, ప్రస్తుత ధోరణి మరింత సడలింపులకు తగినంత అవకాశం కల్పిస్తుందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది.

5. స్థిరమైన భారత రూపాయి (ఐఎన్ఆర్): "స్థిరమైన భారత రూపాయి కారణంగా, పోర్ట్​ఫోలియో- సంస్థాగత విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఎఫ్ఐఐలలో ఇటీవలి ట్రెండ్ రివర్స్​కి భారత రూపాయి బలపడటమం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అందువల్ల, 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో సహా ఆర్బీఐ చర్యల తరువాత భారత స్టాక్ మార్కెట్​లో ప్రస్తుత ర్యాలీ, ఎఫ్ఐఐలు భారతీయ స్టాక్స్ వైపు మొగ్గు చూపడానికి కారణం," అని లక్ష్మీశ్రీ ఇన్వెస్ట్​మెంట్ అండ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్ అన్నారు.

స్టాక్ మార్కెట్ ఔట్​లుక్

ఈ ర్యాలీ అనంతరం భారత స్టాక్ మార్కెట్ దృక్పథంపై కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్​మెంట్ సర్వీసెస్ ఫౌండర్ అరుణ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 2వ తేదీన సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలు.. స్టాక్​ మార్కెట్​లకు ముఖ్యమైన ఘట్టం. భారత మార్కెట్​లలో ఏప్రిల్ 3న ట్రేడింగ్ పునఃప్రారంభమైనప్పుడు ఈ ప్రకటనల ప్రభావం మనపై పడుతుంది. మార్కెట్లకు అర్థవంతమైన ఎక్స్​పోజర్​ తీసుకునే ముందు పర్యవసానాలను అధ్యయనం చేయడం అర్థవంతంగా ఉంటుంది," అని అన్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాష్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం