Maruti Suzuki price hike : కస్టమర్స్కి షాక్- భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..
Maruti Suzuki price hike : వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు మారుతీ సుజుకీ సంస్థ రెడీ అయ్యింది. 2025 జనవరిలో తమ ప్రాడక్ట్స్పై కనీసం 4శాతం ప్రైజ్ హైక్ తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నూతన ఏడాది ప్రారంభంలో కస్టమర్స్పై ‘ధరల’ భారాన్ని మోపేందుకు ఆటోమొబైల్ సంస్థ సిద్ధమవుతున్నాయి. 2025 జనవరిలో కార్ల ధరలను పెంచుతున్న సంస్థల జాబితాలో తాజాగా మారుతీ సుజుకీ సైతం చేసింది. జనవరి 2025 నుంచి తమ లైనప్లోని అన్ని ప్రాడక్ట్స్పై ధరలు కనీసం నాలుగు శాతం పెరుగుతాయని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హ్యుందాయ్ తన లైనప్లోని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మారుతీ సుజుకీ సైతం ఇదే విషయంపై ప్రకటన చేయడం గమనార్హం.
మారుతీ సుజుకీ ఈ రోజు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా ధరల పెంపును ప్రకటించింది. ధరల పెంపు నాలుగు శాతం వరకు ఉండే అవకాశం ఉందని, మోడళ్లను బట్టి మారవచ్చని కార్ల తయారీ సంస్థ తెలిపింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల భారాన్ని కొత్త సంవత్సరం నుంచి తమ వినియోగదారులకు బదిలీ చేయకతప్పడం లేదని పేర్కొంది.
హ్యుందాయ్ నుంచి మెర్సిడీస్ వరకు..
జనవరి నుంచి ధరల పెంచుతామని ప్రకటించిన భారతదేశంలో ఐదవ కార్ల తయారీదారు మారుతీ సుజుకీ! జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీలు ఇప్పటికే ప్రైజ్ హైక్ని చెప్పేశాయి. హ్యుందాయ్ కూడా ఈ లిస్ట్లో ఉంది.
అన్ని కార్ల తయారీదారులు ప్రైజ్ హైక్ నిర్ణయాల వెనుక “ఇన్పుట్ ఖర్చులు”, “నిర్వహణ వ్యయాల పెరుగుదల”ను ప్రధాన కారణాలుగా చెబుతున్నాయి.
"ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మార్కెట్కి బదిలీ చేయవలసి ఉంటుంది," అని మారుతి సుజుకి ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ధరలను పెంచే కంపెనీల జాబితా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
భారతదేశంలో మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు..
దాదాపు 40 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా కొనసాగుతోంది మారుతీ సుజుకీ. గత ఏడాది నవంబర్తో (1.34 లక్షల యూనిట్లు) పోలిస్తే ఈసారి 1.44 లక్షల యూనిట్లకు పైగా దేశీయ అమ్మకాలు నమోదయ్యాయి. బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీలతో కూడిన యుటిలిటీ వాహన విభాగంలో 16.9 శాతం వృద్ధి నమోదైంది. ఎర్టిగా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఎంపీవీలు మారుతీ అమ్మకాలను నడిపించాయి. కాగా ఎస్యూవీలతో డీలాపడిన చిన్న కార్ల విభాగం తనను తాను పునరుద్ధరించుకోవడానికి కష్టపడుతోంది!
హ్యుందాయ్ వాహనాల ధరలు కూడా..
జనవరి 2025 నుంచి తమ లైనప్లోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కానీ ఏ మోడల్ పై, ఏ వేరియంట్పై ఎంత ధర పెంచబోతోందో ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ పెంపు రూ. 25 వేల వరకు ఉంటుందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ హింట్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం