మచ్ అవైటెడ్ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్యూవీపై కీలక అప్డేట్ ఇచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. ఈ విటారాను భారత దేశంతో పాటు ఎగుమతి మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు 2025 సెప్టెంబర్లో డెలివరీలు మొదలవుతాయని స్పష్టం చేసింది.
దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ ఈ విటారా. 2025 ఆటో ఎక్స్పోలో సంస్థ దీనిని ప్రదర్శించింది. ఈ ఆల్- ఎలక్ట్రిక్ ఎస్యూవీ అందరిని ఆకర్షించింది.
మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సీ.భార్గవ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విటారా డెలివరీలు 2025 సెప్టెంబర్ నాటికి భారతదేశంలో ప్రారంభమవుతాయని ధృవీకరించారు. ఈ ఏడాది 70,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తం 70,000 యూనిట్లలో ఎక్కువ యూనిట్లను ఎగుమతి మార్కెట్లకు కేటాయించనున్నారు. మిగిలిన యూనిట్లను దేశీయంగా విక్రయించి డిమాండ్కు అనుగుణంగా పరీక్షించనున్నారు.
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని మే లేదా జూన్లో లాంచ్ చేసే అవకాశం ఉంది! ప్రత్యేక డీలర్షిప్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించే యోచన లేదని, అమ్మకాల కోసం ప్రస్తుత సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని మారుతీ సుజుకీ ధృవీకరించింది.
లాంచ్ తర్వాత ఈ మారుతీ సుజుకీ ఈ విటారా టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది.
మారుతీ సుజుకీ నుంచి ఈ ఏడాది చివరిలో మరో ఎస్యూవీ రాబోతోందని సమచారం. తమ పోర్ట్ఫోలియోలో మరో ఎస్యూవీ చేరుతుందని ఛైర్మన్ ఆర్.సీ. భార్గవ తెలిపారు. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఏడు సీట్ల వెర్షన్ భారతీయ రోడ్లపై స్పాట్ టెస్టింగ్ గురించి అనేక నివేదికలు వచ్చాయి. రాబోయే ఈ ఎస్యూవీ ఇదే కావచ్చు!
స్పై షాట్లలో, గ్రాండ్ విటారా సెవెన్-సీటర్ ఎస్యూవీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేసే ఫ్రీ-స్టాండింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ని కలిగి ఉంది. గ్రాండ్ విటారా సెవెన్ సీటర్ క్యాబిన్లో ఇతర మార్పులు కూడా ఆశించవచ్చు. వీటిలో కొద్దిగా రీడిజైన్ చేసిన డ్యాష్బోర్డ్తో పాటు కొత్త కలర్ షేడ్, కొత్త అప్హోల్స్టరీ ఉన్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి అన్ని మారుతీ సుజుకీ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా అప్డేట్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇటీవల, కార్ల తయారీదారు ఎంవై 2025 గ్రాండ్ విటారా, ఎంవై 2025 వ్యాగన్ఆర్లకు ఈ భద్రతా ఫీచర్ని జోడించారు.
సంబంధిత కథనం